దాతృత్వం: చిన్నారుల కోసం జూకర్ బర్గ్ భార్య చాన్ కన్నీళ్లు
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నపిల్లల్లో వ్యాధులు, నివారణకు ఉద్దేశించిన ప్రణాళికక కోసం 3 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.20 వేల కోట్ల పై మాటే) ఖర్చు చేయనున్నట్లు జూకర్, ఆయన సతీమణి చాన్ ప్రకటించారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జూకర్ బర్గ్ దంపతులు ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రిస్కిల్లా చాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడి జీవితాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పిల్లలు జబ్బుపడ్డపుడు తల్లిదండ్రుల కష్టాలు, బాధలు ఒక చిన్న పిల్లల వైద్యురాలిగా తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. ఆ క్షణాలలో వ్యాధి లక్షణాలు ఆధారంగా బాధ నుంచి ఉపశమనానికి తమ సామర్ధ్యం, పరిమితి మేరకు పనిచేస్తామని చెప్పారు. ఆ పరిమితులను అధిగమించేందుకు తమ శక్తి వంచన లేకుండా యోచిస్తున్నామని చెప్పారు.
చిన్నారులకు వచ్చే వివిధ రకాల వ్యాధులను నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. అనంతరం జూకర్ బర్గ్ మాట్లాడుతూ మన చిన్నారులకు మంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు. తమ ప్రాజెక్టులో భాగంగా చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇందుకోసం వచ్చే పదేళ్లలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు. తొలి దశలో భాగంగా సుమారు రూ. 4.010 కోట్లు(600 మిలియన్) డాలర్లతో శాన్ఫ్రాన్సిస్కోలో పిల్లల జీవితకాలంలో సంభవించే అన్ని రకాల వ్యాధులను నిరోధించడానికి కృషి చేసే నిమిత్తం 'బయోహబ్ ' అనే బయోసైన్స్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
యూసీఎస్ఎఫ్, స్టాన్ఫర్డ్, కాలిఫోర్నియా యూనివర్శిటీ భాగస్వామ్యంలో ఈ బయోహబ్లో పరిశోధనలు చేపట్టనున్నట్టు చెప్పారు. హెచ్ ఐవీ, ఎబోలా, జికా లాంటి ప్రాణాంతక వ్యాధుల నివారణ మందులు, వ్యాక్సీన్ల తయారీకి కృషి జరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10, 15 లాబరేటరీస్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ మాజీ ఛైర్మన్ బిల్ గేట్స్, శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ ఎడ్ లీ, కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ గావిన్ సహా పలువురు హాజరయ్యారు. చాన్ జూకర్ బర్గ్ ఇనిషియేటివ్పై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ హర్షం వ్యక్తంచేశారు. నాలుగు రకాల వ్యాధుల కారణంగా పిల్లల్లో మరణాలు సంభవిస్తున్నాయని జూకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు.