ఫ్రీ ఇంటర్నెట్ అసాధ్యం,యువతి కిందపడింది:జుకర్బర్గ్
ఢిల్లీ: భారత దేశంలో పర్యటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బుధవారం అన్నాడు. ఆయన ఐఐటీ ఢిల్లీ విద్యార్ధులతో ఉదయం ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత్కు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితులకు ఫేస్బుక్ సాయం అందిస్తోందన్నారు. ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశం లేకుండా ప్రపంచ దేశాలతో సంబంధాలు చేపట్టలేమన్నారు. వంద కోట్ల ప్రజలను ఆన్లైన్లోకి తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు.
ఫేస్బుక్ను అత్యధికంగా వాడే వారిలో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. వంద కోట్ల మందిని ఫేస్బుక్ యూజర్లుగా చేయడం లక్ష్యమన్నారు. ప్రస్తుతం నాలుగు బిలియన్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉందన్నారు. ప్రతి ఒక్కరినీ ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తామన్నారు.

ఫేస్బుక్కు భారత్ ప్రధాన మార్కెట్ అన్నారు. జుకర్బర్గ్తో ఇష్టాగోష్టిలో 900 మంది విద్యార్థులు, పలువురు అధ్యాపకులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. టౌన్హాల్కు వచ్చిన జుకర్బర్గ్కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కాగా, భారత్కు వచ్చిన జుకర్బర్గ్ నిన్న తాజ్మహల్ను సందర్శించిన విషయం తెలిసిందే.
ఐఐటీ ఢిల్లీ విద్యార్థులలో ఓ విద్యార్థి.. నెట్ న్యూట్రాలిటీని ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించగా.. అవునని జుకర్ బర్గ్ సమాధానం ఇచ్చారు. ఓ సందర్భంలో తాజ్ మహల్ బాగుందన్నారు. ఫేస్బుక్ పేదలకు, చదువుకోని వారికి ఎలా ఉపయోగపడుతుందనే విషయమై శోధిస్తున్నట్లు చెప్పారు.
నెట్ న్యూట్రాలిటీకి మద్దతిస్తున్నామన్నారు. పలు దేశాలు నెట్న్యూట్రాలిటీ నిబంధనలపై ఇంకా ఓ స్పష్టతకు రాలేదని, పూర్తిగా ఇంటర్నెట్ ఉచితంగా అందించడం సాధ్యపడదన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) పైన ఫేస్బుక్ పెట్టుబడిపై మాట్లాడుతూ... వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో మనుషుల కంటే బెటర్ హ్యూమన్ సెన్స్ ఉండే కంప్యూటర్ను తయారుచేసేందుకు కృషి చేస్తున్నామని, ఏఐ ద్వారా అంధులకు ఫోటోల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారి కోసం ఏం చేస్తారని ఓ విద్యార్థి ప్రశ్నించగా... వారి కోసం సాంకేతికాభివృద్ధి ద్వారా సహాయపడతామన్నారు. ఏలియన్ నుంచి మీకు ఏదైనా సూపర్ పవర్ గిఫ్ట్గా వస్తే ఏం కోరుకుంటారని ప్రశ్నించగా... టెక్నాలజీలో ఉన్న మంచి విషయం ఏంటంటే.. మనకు కావాల్సిన సూపర్పవర్ను మనమే అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు.
తాజ్మహల్ వద్ద మిమ్మల్ని ఎవరైనా గుర్తు పట్టారా అని మరో విద్యార్థి అడగ్గాడ... ఓ అమ్మాయి నన్ను ఫొటో తీయడానికి ప్రయత్నించి కింద పడిందన్నారు. క్యాండీ క్రష్ ఆట ఇన్విటేషన్స్ రాకుడదంటే ఏం చేయాలనేందుకు పరిష్కారం ఉందని, దానిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
భారత్పై ఎందుకు అమితాసక్తి చూపడం పై ప్రశ్నించగా... భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యం ఉన్నప్పుడు భారత్ లేకుండా అది సాధ్యం కాదన్నారు. భారత్లో ప్రజలతో కనెక్ట్ అవ్వడం చాలా అవసరమన్నారు.












Click it and Unblock the Notifications