ఫేస్బుక్కు భారత్ షాక్: రాజీపడేది లేదని జుకర్ బర్గ్
న్యూఢిల్లీ: ఫ్రీ బేసిక్స్ పైన భారత్లో తనకు చుక్కెదురు కావడంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించాడు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
అయినప్పటికీ నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకునే విషయంలో రాజీ పడబోనని ప్రకటించాడు. బహుళ ప్రయోజనాలున్న ఇంటర్నెట్.ఆర్గ్ను ఒక్క భారత్లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందేలా చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు.
ఫ్రీ బేసిక్స్ పేరిట భారత ఇంటర్నెట్ వినియోగదారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు మార్క్ జుకెర్ బర్గ్ చేసిన యత్నాలకు ట్రాయ్ నిన్న బ్రేకులేసిన విషయం తెలిసిందే. నెట్ న్యూట్రాలిటీకి పచ్చజెండా ఊపిన ట్రాయ్.. ఫ్రీ బేసిక్స్ లాంటి వేర్వేరు టారిఫ్ల ఇంటర్నెట్కు ససేమిరా అంది.
తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఊరట కల్పించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చలో నెట్ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది.
వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. దీంతో ఫేస్బుక్ అందించాలనుకున్న ఫ్రీ బేసిక్స్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ట్రాయ్ చైర్మెన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.