ఉగ్రదాడి: పాక్ లో జైష్ నేత మసూద్ అరెస్టు
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ తీసుకువచ్చిన ఒత్తిడికి పాకిస్థాన్ ప్రభుత్వం తలొగ్గింది. పఠాన్ కోట్ ఉగ్రదాడికి స్కెచ్ వేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద నాయకుడు, జైష్-ఏ-మహమ్మద్ చీఫ్ మౌలనా మసూద్ అజర్, అతని సోదరుడు రెహమాన్ రవూఫ్ లను పాక్ అరెస్టు చేసింది.
మసూద్ అతని సోదరుడిని అరెస్టు చేశామని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. వీరితో పాటు పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేశామని పాక్ ప్రభుత్వం తెలిపింది. జైష్ కార్యాలయాలను సీజ్ చేశామని వెల్లడించింది.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షరీఫ్, ఐఎస్ఐ చీఫ్, హోం, ఆర్థిక మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గోన్నారు.
పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఏరివేసేందుకు పకడ్బందీగా పని చేయాలని, భారత్ తో కలిసి పని చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని నిర్ణయించింది. ఈనెల 15వ తేది శుక్రవారం ఇస్లామాబాద్ లో పాక్, భారత్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగవలసి ఉంది.
అయితే పఠాన్ కోట్ ఉగ్రదాడి నేపధ్యంలో ఈ సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. మసూద్ అజర్ ఆదేశాల మేరకే పఠాన్ కోట్ మీద ఉగ్రదాడి జరిగిందని భారత్ పాక్ కు సాక్షాలు ఇవ్వడంతో పాక్ ఇప్పుడు అయోమయంలో పడిపోయింది.