ఫారెన్ ట్రిప్స్: మోడీని మించిపోయిన షరీఫ్!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: విదేశీ పర్యటనలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని మించిపోయారు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇప్పటిదాకా మోడీనే విదేశాల్లో ఎక్కువగా సంచరిస్తున్నారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
2014 మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 20నెలల కాలంలో అంటే 600 రోజుల్లో 32దేశాల్లో పర్యటించారు. కాగా, పాక్ ప్రధాని షరీఫ్ అందుకు రెండింతలు ఎక్కువే విదేశాల్లో పర్యటించారు.
2013 జూన్లో పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇప్పటిదాకా 185రోజులు ఇతర దేశాల్లోనే గడిపారు. ఆయన అధికారంలోకి వచ్చి 940రోజులు అవుతుండగా.. సగటున ఐదురోజులకోసారి పాకిస్థాన్ను విడిచివెళ్తున్నట్టు తేలింది.

షరీఫ్ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ అసెంబ్లీకి తెలిపింది. దానిప్రకారం.. ఆయన ఇప్పటివరకు ఎక్కువగా బ్రిటన్లో పర్యటించారని (17సార్లు), సరాసరి 2నెలలకాలం అక్కడే గడిపారని తెలుస్తోంది. 65 దేశాల్లో పర్యటించిన నవాజ్ షరీఫ్.. ఇందుకోసం మొత్తంగా రూ. 63.8 కోట్లు ఖర్చు చేశారు.
అమెరికాలో మోడీ - షరీఫ్ భేటీ
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీకానున్నారు. అమెరికాలో వచ్చే నెలలో జరగనున్న అణు సదస్సులో ఇద్దరూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మోడీ, షరీఫ్ను ఆహ్వానిస్తూ అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పంపిన ఆహ్వానాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించినట్లు తెలుస్తోంది.
మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో అణుభద్రతా సదస్సు జరగనుంది. 2010 నుంచి బరాక్ ఒబామా ఆ సదస్సును నిర్వహిస్తున్నారు. అయితే మోడీ, షరీఫ్లు తొలిసారి ఆ సదస్సుకు హాజరుకానున్నారు. అణ్వాయుధాల నుంచి ఉగ్రవాదులను నియంత్రించే లక్ష్యంతో ఆ సదస్సును నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రపంచదేశాధినేతలు ఆ సదస్సులో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications