20 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ‘సూపర్ ఎం ఛార్జ్’స్మార్ట్ ఫోన్
చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ‘మీజూ’ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ను మాత్రం కేవలం 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
బార్సిలోనా: సరైన ఛార్జర్ తోపాటు, వేగంగా ఛార్జ్ చేయగలిగే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి చైనా కంపెనీలు. సాధారణంగా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఫోన్ ను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? సుమారు రెండు గంటలు పట్టొచ్చంటారా?
కానీ చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ 'మీజూ' కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ను మాత్రం కేవలం 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ప్రస్తుతం బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్-2017 ప్రదర్శనలో మీజూ ఈ ఫోన్ ను ఆవిష్కరించింది.
'సూపర్ ఎం ఛార్జ్' పేరుతో విడుదలైన ఈ ఫోన్.. ఐఫోన్ 7 ప్లస్ కన్నా 11 రెట్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుందట. కేవలం 5 నిమిషాల్లోనే ఈ ఫోన్ 30 శాతం ఛార్జ్ అయిపోతుందట.
ఈ ఫోన్ తయారీలో కొత్త టెక్నాలజీని వినియోగించినట్లు మీజూ పేర్కొంది. ఇది అత్యంత భద్రతతో కూడిన ఫోన్ అని, అదే సమయంలో ఎక్కువ సేపు పనిచేస్తుందని తెలిపింది. అలాగే ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ వేడెక్కకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొంది.
గత ఏడాది జరిగిన ప్రదర్శనలో కూడా ఒప్పో వీవోవోసీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని తెలిపింది. అదే తరహాలో ఈ ఏడాది మీజూ కంపెనీ ఈ 'సూపర్ ఎం ఛార్జ్' స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడం విశేషం.