మెక్సికో: రూ.7 కోట్ల లాటరీ గెల్చుకున్న పాఠశాల.. ఇబ్బందుల్లో పడిన గ్రామస్తులు
దక్షిణ మెక్సికోలో చిన్న పిల్లలు చదువుకునే ఒక బడికి 2 కోట్ల పెసోల (సుమారు 7 కోట్ల రూపాయల) విలువైన లాటరీ తగిలింది. అయితే, ఆ బడిలో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులంతా ఈ లాటరీ వల్ల తాము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు.
మెక్సికోలో ప్రభుత్వమే 'ప్లేన్ లాటరీ' పేరిట ఒక లాటరీ నిర్వహించింది. ఒక్కో టికెట్ ఖరీదు 500 పెసోలు.
కొందరు అజ్ఞాత వ్యక్తులు చాలా టికెట్లను కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పాఠశాలలు, నర్సరీలకు దానం చేశారు.
అలా టికెట్లు పొందిన వాటిలో ఒకసింగో గ్రామంలోని నర్సరీ కూడా ఉంది. ఇందులో 20 మందికి పైగా చిన్నారులు చదువుతున్నారు.
సెప్టెంబర్ నెలలో విజేతల వివరాలను ప్రకటించారు.
వంద మంది విజేతల్లో ఒకసింగో నర్సరీ కూడా ఒకటి.
డబ్బుల్లేక, ఆర్థిక సహాయం అందక ఇబ్బందులు పడుతున్న ఈ చిన్నపిల్లల బడికి ఇప్పుడు ఒక్కసారిగా 7 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఈ గ్రామస్తులంతా ఆనందంతో సంబరాలు చేసుకోవాలనుకున్నారు. కానీ గాలివాన రావడం వల్ల వారు అనుకున్నది అనుకున్నట్లు చేసుకోలేకపోయారు. అయితే, వీళ్ల అదృష్టం గురించి, ఆనందం గురించి స్థానిక పత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.
అప్పట్నుంచే వాళ్లకి కష్టాలు కూడా మొదలయ్యాయి.
లాటరీలో వచ్చిన సొమ్ము ఖర్చు చేసే బాధ్యతను నర్సరీలో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు చూసుకుంటున్నారు.
వాస్తవానికి దాదాపు 60 లక్షల పెసోలను ఇప్పటికే వాడారు. కొంత మొత్తంతో పాఠశాల పైకప్పును నిర్మించారు.
మిగతా కోటీ 40 లక్షల పెసోలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ, వాళ్లకు స్థానిక సాయుధ ముఠా ఒకటి అడ్డుతగిలింది.
- రైతు కూలీకి రూ.12 కోట్ల లాటరీ తగిలింది
- రూ. 190 కోట్ల లాటరీ గెలిచానంటున్న మహిళ... టికెట్ను పొరపాటున దుస్తులతో కలిపి ఉతికేశారట
లాటరీ సొమ్ముతో గన్స్ కొనిపెట్టాలని డిమాండ్
నర్సరీకి లాటరీ తగిలిందని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న సాయుధ ముఠా.. ఆ డబ్బుతో తమకు ఆయుధాలు కొనిపెట్టాలని బెదిరించింది.
మెక్సికోలో ముఠాల హింస తీవ్రంగా ఉంది. తమతమ అడ్డాలుగా భావించే ప్రాంతాలపై పట్టు కోసం, ప్రత్యర్థి ముఠాలపై పోరాటానికి ఈ గ్యాంగ్లు స్థానికులను కూడా నియమించుకుంటాయి.
'లాస్ పెటుల్స్' అనే గ్రూప్ నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని ఒకసింగో నర్సరీ పేరెంట్స్ అసోసియేషన్ చెప్పింది.
ఈ సాయుధ ముఠా, పక్కనే ఉన్న గ్రామంలోని ప్రత్యర్థి ముఠాతో తలపడుతుంటుందని పేరెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. తమకు గన్స్ కొనుగోలు చేసిపెట్టాలని గ్యాంగ్ తమను బెదిరించిందని వివరించింది.
గ్యాంగ్ బెదిరింపులను పట్టించుకోకుండా తల్లిదండ్రుల కమిటీ.. పాఠశాల పైకప్పును పునరుద్ధరించేందుకు కొంత సొమ్మును ఖర్చు చేసింది. మిగతా సొమ్మును కూడా గ్రామాభివృద్ధికి వాడాలని నిర్ణయించింది.
ప్రైజ్ మనీని తమకు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఒక విద్యార్థి తండ్రిని గ్యాంగ్ కాల్చింది.
గత నెలలో ప్రైజ్ మనీ కోసం ఈ గ్యాంగ్ గ్రామంలోని మహిళలు, చిన్నారులు టార్గెట్గా దాడులు చేసింది. పరిస్థితి తీవ్రంగా మారటంతో 28 కుటుంబాలు గ్రామం వదిలిపెట్టి పారిపోయాయి.
గ్రామాన్ని విడిచిపెట్టి తాము చాలా కష్టాలు పడుతున్నామని ఆ కుటుంబాలు చెబుతున్నాయి.
సాయుధ ముఠా దాడుల వల్ల గ్రామస్తులు.. పశువులు, ఇళ్లు, రిఫ్రిజిరేటర్లు, మొక్కజొన్న, బీన్స్ పంటలు, కోళ్లు కోల్పోవాల్సి వచ్చిందని పేరెంట్స్ అసోసియేషన్కు చెందిన ఒక సభ్యుడు చెప్పారు.
స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తమ దుస్థితిని విన్నవించుకున్నామని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుడు వెల్లడించారు.
ఈ ముఠా నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేస్తే తప్ప తాము తమ ఇళ్లకు తిరిగి వెళ్లలేమని పారిపోయిన కుటుంబాలవాళ్లు చెబుతున్నారు.
- మెక్సికో: '20 మందిని చంపేసి.. అవయవాలు అమ్మేసిన జంట’
- ఈ దేశంలో ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు... ఈ బీభత్సానికి కారణం ఎవరు?
'విమానం లాటరీ’ కథ ఏంటంటే..
ప్రస్తుతం మెక్సికోకు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఓబ్రడార్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనకు ముందు ఎన్రిక్ పెన్న నీటో అధ్యక్షుడిగా పనిచేశారు.
ఎన్రిక్ నీటో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాన్ని వాడేవారు.
ప్రభుత్వ సొమ్ముతో విలాసానికి చిరునామాగా ఈ విమానాన్ని వాడుకున్నారని లోపేజ్ ఓబ్రడార్ ఆరోపించారు. ఈ విమానాన్ని లాటరీ రూపంలో విక్రయిస్తానని ఆయన 2020 ఫిబ్రవరి నెలలో ప్రకటించారు. తద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తానని చెప్పారు.
ఒక ప్రెసిడెన్షియల్ సూట్, ప్రైవేట్ స్నానాల గది ఉన్న ఈ లగ్జరీ విమానాన్ని 2012వ సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు ఎన్రిక్ నీటో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
ఓపేజ్ ఓబ్రడార్ అధికారం చేపట్టిన తర్వాత వాణిజ్య విమానాల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. ప్రెసిడెంట్ విమానాన్ని 80 మంది ప్రయాణించేందుకు వీలుగా మార్చారు.
అయితే, విమానం లాటరీని చాలామంది విపరీతంగా వెక్కిరించారు. సామాన్య ప్రజలు ఎవరైనా లాటరీలో ఈ విమానాన్ని గెల్చుకుంటే.. వాళ్లు దీనిని ఏం చేసుకుంటారు అని ప్రశ్నించారు.
దీంతో లాటరీలో బహుమతిని మార్చారు. వంద మంది విజేతలకు 7 కోట్ల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఒక్కో లాటరీ టికెట్ ధరను 500 పెసోలు (సుమారు 2 వేల రూపాయలు)గా నిర్ణయించింది. ఈ లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా మొత్తం వెయ్యి కోట్లకు పైగా సొమ్ము వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
నగదు బహుమతి పోగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తామని ప్రకటించింది.
ఆ విమానాన్ని మాత్రం అమ్మేయాలని, ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోతే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
- వందేళ్ల చరిత్రలో తొలి మహిళా ప్రధాని... గంటల్లోనే రాజీనామా
- మైనర్ బాలుడితో ఓరల్ సెక్స్ను తీవ్రమైన లైంగిక నేరంగా పరిగణించలేమన్న అలహాబాద్ హైకోర్టు
- ఆంధ్రప్రదేశ్కు దత్తతగా వచ్చిన బిడ్డను తిరిగి కేరళ ఎందుకు తీసుకెళ్లారు? అసలేంటీ వివాదం?
- ఇంగ్లిష్ చానల్లో అక్రమ వలసదారుల పడవ మునక, 27 మంది మృతి
- నీటి పైపుల్లో నోట్ల కట్టలు, అవాక్కయిన అధికారులు - ప్రెస్ రివ్యూ
- రాయలసీమలో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు, నష్టం అంచనా రూ.6వేల కోట్లకు పైనే, అసలేం జరిగింది?
- బిట్కాయిన్ను కేంద్రం నిషేధిస్తుందా.. క్రిప్టోకరెన్సీపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- అభినందన్ వర్థమాన్కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)