నోకియా: మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యధిక నష్టం
మైక్రోసాప్ట్ కార్పోరేషన్ స్ధాపించిన తర్వాత ఎన్నడూ లేనంత నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ - జూన్తో ముగిసిన త్రైమాసికంలో సంస్ధ 3.2 బిలియన్ డాలర్ల (సుమారు 20,368 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసినట్లు ప్రకటించింది.
నోకియా ఫోన్ బిజినెస్ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తాన్ని 'రైటాఫ్' చేయడమే ఇందుకు కారణమని సంస్ధ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు డిమాండ్ తగ్గడం, ఆండ్రాయిడ్తో విండోస్ పోటీపడలేక పోవడం తదితర కారణాలతో సంస్ధ నష్టాలను నమోదు చేసింది.
ఈ మూడు నెలల కాలంలో 4.61 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. మైక్రోసాప్ట్ ఫలితాలను వెల్లడించిన తర్వాత న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్లో సంస్ధ షేరు విలువ 4 శాతం దిగజారి 45.38 డాలర్లకు చేరింది.
మైక్రోసాప్ట్ ఫలితాల విడుదల సందర్భంగా సంస్ధ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ తమ సేవలను సాఫ్ట్వేర్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ వైపు మళ్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. జులై 29న విండోస్ 10ను ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాప్ట్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.