'డాన్' అలజడి: షరీఫ్కు 5 రోజుల గడువిచ్చిన పాక్ సైన్యం
కరాచీ: పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలున్నట్లుగా డాన్ పత్రికలో వచ్చిన కథనం అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం నాడు (14వ తేదీ) కార్ప్స్ కమాండర్ల సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపించింది.
ఈ నెల 3న జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన రహస్య వివరాలను డాన్ ప్రతినిధి సిరిల్ అల్మీదాకు పీఎంఓలో ఉన్నవారే ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో ఐదు రోజుల్లో బయట పెట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో డాన్ కథనం కల్పితమని, తప్పు అని చెప్పింది.
ఈ కథనం దేశ భద్రతకు ప్రమాదకరమని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. అయితే, తప్పుడు సమాచారం వల్ల ఏ విధంగా హాని జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ పీఎంఓ సిరిల్ అల్మీదాను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్లో పెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయంపై తగ్గింది.
కాగా, సిరిలి అల్మిదా సంచలన కథనం డాన్లో ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. వాటిని పత్రిక సంపాదకులు కూడా సమర్థించారు. తాము మళ్ళీ మళ్ళీ సరిచూసుకొని ఈ కథనాన్ని ప్రచురించామన్నారు.
అయితే ఈ కథనం నవాజ్ షరీఫ్కు ఆయన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్కు అనుకూలంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉందని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మండిపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఉగ్రవాదులను కటకటాల్లోకి నెట్టే యోధులుగా ఈ కథనంలో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.