అమెరికా-ఉ.కొరియా యుద్దం?: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కీలక ప్రకటన.. వారికే మద్దతు!
ఉత్తరకొరియా తీరుపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కోమ్ టర్న్బుల్.. తమ మద్దతు అమెరికాకే అని ప్రకటించారు.
కాన్బెర్రా: ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్ద వాతావరణం ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. అమెరికా సహా ఎన్ని దేశాలు వారించినా ఉత్తరకొరియా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సరికదా.. యుద్దానికి కాలు దువ్వుతూ అణు ప్రయోగాలు చేపడుతూనే ఉంది.
అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణి ప్రయోగాలు, హెచ్చరికలు ఆ దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ను ఇలాగే వదిలేస్తే.. అమెరికాను ఎక్కడ నాశనం చేస్తాడోనన్న ఆందోళన వారిలో మొదలైంది.
ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా అమెరికాకు అండగా నిలబడింది. ఉత్తరకొరియా తీరుపై స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కోమ్ టర్న్బుల్.. తమ మద్దతు అమెరికాకే అని ప్రకటించారు. ఈ సందర్భంగా 1951 ఏఎన్జడ్యూఎస్(ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా) ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు.
దాని ప్రకారం తాము అమెరికాకే మద్ధతు తెలపాల్సి ఉందని, ఒకవేళ తమ దేశంపై దాడి జరిగితే అమెరికా తమకు అండగా నిలబడాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు మైక్పెన్స్తో ఆయన చర్చలు జరిపారు.
మరోవైపు ఆస్ట్రేలియా బాటలోనే న్యూజిలాండ్ కూడా పయనిస్తోంది. ఉత్తరకొరియాతో యుద్ద పరిస్థితులు ఏర్పడితే.. సైనిక సహాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని న్యూజిలాండ్ ప్రకటించింది.
కాగా, పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా భూభూగమైన గువాం ద్వీపకల్పంపై దాడి చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు ఎప్పుడెలా మారుతాయోనన్న ఆందోళన నెలకొంది.