మోదీజీ.. 385 రోజులైంది -ఇకనైనా ఈవెంట్స్ పక్కనపెట్టి, వ్యాక్సినేషన్పై దృష్టి పెట్టండి: రాహుల్ గాంధీ
దేశంలో కొవిడ్ వైరస్ రెండోదశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతోంది. కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలతో గత రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. కేంద్రం ఎంతో ఉత్సాహంగా టీకా ఉత్సవం ప్రకటించినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు నిండుకున్నాయి. కాగా, విలయ కాలంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రధాని మోదీ బొత్తిగా బాధ్యత మరిచి పొలిటికల్ ఈవెంట్లతో కాలక్షేపం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్, కేంద్రం అలసత్వ వైఖరిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈవెంట్స్ నిర్వహించడం మానేసి, అందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ రాహుల్ చురకలంటించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోందని, వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని కోరారు.
ప్రస్తుతం దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకునే పేద ప్రజలకు కేంద్రం సాయం చేయాలని మోదీని రాహుల్ కోరారు. 18 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామని మోదీ గతంలో ప్రకటన చేశారని, ఇప్పటికి 385 రోజులు పూర్తయినా, వైరస్ కట్టడి దిశగా మోదీ ఒక్క అడుగైనా వేయలేదని కాంగ్రెస్ నేత మండిపడ్డారు.
Fact Check: వాట్సాప్ ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ నిజమేనా? కేంద్రం షాకింగ్ వివరణ
''గంటలు మోగించారు. ప్లేట్లు మోగించారు. ఫోన్ టార్చ్లను వెలిగించారు. అయినా కరోనా వేవ్ సాగుతోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతోంది. లక్షల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈవెంట్స్పై దృష్టి మానేసి, వ్యాక్సినేషన్పై దృష్టి సారించండి. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతలను ఆపేయండి. పేదలకు వీలైనంత సహాయం అందించండి'' అని రాహుల్ గాంధీ సూచించారు.