కొత్త కరోనా వేరియంట్ల కలకలం: కొత్తగా వ్యాక్సిన్లకు లొంగని ‘మూ’ వేరియంట్ గుర్తింపు
దిహేగ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఇప్పటికే అల్లకల్లోలం సృస్టిస్తుండగా.. తాజాగా వెలుగుచూస్తున్న కొత్త వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు వేరియంట్లు తీవ్ర నష్టం కలిగించగా.. ఇప్పుడు మరో వేరియంట్ వెలుగుచూసింది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.
Recommended Video
తాజాగా, మూ(ఎంయూ) వేరియంట్ను గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడినట్లు తెలిపింది. ప్రస్తుతం 'మూ'ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వేరియంట్కు కరోనా నిరోధక టీకాలను ఏమార్చే గుణాలున్నాయని, దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపింది.

ఇప్పటికే డెల్టా వేరియంట్ వంటి కొత్త వేరియంట్లతో భారత్, అమెరికా, ఇతర దేశాలు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. అమెరికాలో డెల్టా వేరియంట్ కారణంగా ప్రస్తుతం భారీ ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ ఆక్సిజన్ బెడ్ల కొరత కూడా ఏర్పడటం గమనార్హం. వెంటిలేటర్ చికిత్స కూడా అందరికీ అందని పరిస్థితులు నెలకొంటున్నాయి.
డెల్టా వేరియంట్ 170 దేశాల్లో ప్రభావితం చూపగా, ఆల్ఫా వేరియంట్ 193 దేశాల్లో విస్తరించింది. ఇది ఇలావుండగా, కొద్ది రోజుల క్రితమే వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న సీ.1.2గా పిలిచే మరో వేరియంట్ కూడా బయటపడింది. ఇది కూడా కరోనా వ్యాక్సిన్లకు లొంగే రకం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే 'మూ' వేరియంట్ వెలుగుచూడటం శాస్త్రవేత్తలకు సవాల్గా మారాయి.
కాగా, భారత్లో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. కారణంగా గత 24 గంటల్లో 460 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 30,203 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసులలో సగానికిపైగా కరోనా కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
తాజా కేసులతో కలిపి భారత దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి 3.19 కోట్ల మంది బయట పడ్డారు. గత 24 గంటల్లో 33,964 మంది కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది. నిన్న నమోదైన మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి మరణాలలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 115 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొత్త కేసులు పెరుగుతున్న కారణంగా క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల రేటు 1.15 శాతంగా ఉంది. దేశంలో సెప్టెంబరు అక్టోబరు నెలలో కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఐసీఎమ్ఆర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ -19 టీకా వేగం పుంజుకుంది. తాత్కాలిక డేటా ప్రకారం, భారతదేశం మంగళవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 1.25 కోట్లకు పైగా మోతాదులను ఇచ్చింది, ఇది ఒకే రోజులో రికార్డు స్థాయిలో సాగిన వ్యాక్సినేషన్.












Click it and Unblock the Notifications