చంద్రుడి ఉపరితలం ఇలా ఉంటుంది - అత్యంత సమీపం నుంచి తీసిన ఫొటోలు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన లేటెస్ట్ ప్రాజెక్ట్.. ఆర్టెమిస్ 1 మిషన్ మూన్. ఇందులో భాగంగా చందమామపై ప్రయోగాలను చేయడానికి ఇటీవలే ఒరియన్ స్పేస్క్రాఫ్ట్ను పంపించారు నాసా శాస్త్రవేత్తలు. 4.1 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ మూన్ను విజయవంతం చేశారు. రెండు రోజుల కిందటే ఈ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ చక్కర్లు కొడుతోంది.
వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న వైఎస్ జగన్
సెకెనుకు 160 కిలోమీటర్లు..
ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి దీన్ని చంద్రుడిపైకి పంపించింది. సెకెనుకు 160 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్లింది ఒరియన్ స్పేస్క్రాఫ్ట్ను మోసుకెళ్లిన రాకెట్. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి డేటాను గ్రౌండ్ స్టేషన్కు పంపించడం మొదలు పెట్టింది. తాజాగా చంద్రుడికి అతి సమీపానికి వెళ్లింది. దాని ఉపరితలం ఫొటోలను తీసింది. వీటిని నాసా శాస్త్రవేత్తలు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై పోస్ట్ చేశారు.
చంద్రుడి ఉపరితలం నుంచి
చంద్రుడికి అత్యంత సమీపం నుంచి ఈ ఫొటోలను తీసింది ఒరియన్ స్పేస్క్రాఫ్ట్. ఈ నెల 21వ తేదీన తీసిన ఫొటోలు ఇవి. ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో క్లిక్మనిపించింది. ఒరియన్ స్పేస్క్రాఫ్ట్కు అమర్చిన ఆన్బోర్డ్ ఆప్టికల్ నేవిగేషన్ కెమెరా ఈ ఫొటోలను తీసింది. కక్ష్యలోకి ప్రవేశించిన ఆరో రోజు ఈ ఫొటోలను తీసింది. అదే రోజున స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడికి మరింత సమీపానికి చేరుకునేలా ఇంజిన్ను మండించారు.
అతి దగ్గరగా..
జాబిల్లికి ఇంత దగ్గరి నుంచి ఫొటోలను తీయడం ఇదే తొలిసారిగా చెబుతోన్నారు నాసా శాస్త్రవేత్తలు. ఈ ఫొటోల ద్వారా చంద్రుడి ఉపరితలం గురించి ఆరా తీయడానికి అవకాశం కలిగిందని స్పష్టం చేస్తోన్నారు. దీన్ని విశ్లేషిస్తోన్నట్లు వివరించారు. చంద్రుని చుట్టూ ఉన్న ఎత్తైన కక్ష్యలోకి ఈ స్పేస్క్రాఫ్ట్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇవ్వాళ క్యాప్సూల్ సింగిల్ ఇంజిన్ను మండించడం ద్వారా మరింత సమీపానికి వెళ్తుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 11న తిరుగు ప్రయాణం..
వారం రోజుల పాటు ఈ ఒరియన్ క్యాప్సుల్.. చంద్రుడి కక్ష్యలో తిరుగాడుతుందని, సమగ్ర డేటాను గ్రౌండ్ స్టేషన్కు పంపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అనంతరం తిరుగు ప్రయాణమౌతుందని, డిసెంబర్ 11వ తేదీన కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుందని పేర్కొన్నారు. 2024 నాటికి మానవ సహిత మూన్ మిషన్ చేపట్టడంలో భాగంగా దీన్ని ప్రయోగించారు నాసా శాస్త్రవేత్తలు. ఈ ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్లో డమ్మీ ఆస్ట్రోనాట్స్ను అమర్చడానికి ఇదే ప్రధాన కారణం.