అమెరికాలో కరోనా విలయం.. ఒక్క రోజులో 14 లక్షలకుపైగా కేసులు.. కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థ
అమెరికారో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నిన్న ఒక్కరోజే 14 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారీగా రోగులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1,41, 385 మంది ఆస్పత్రులలో చేరారు. గత వారం రోజులుగా సగటున ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితులు పెరగడంతో అమెరికన్లు భయాందోళనకు గురవుతున్నారు.
ఒక్క రోజులో 14,17,493 కొత్త కేసులు
అగ్రరాజ్యం అమెరికాను ఒకవైపు కరోనా, మరోవైపు కొత్తవేరియంట్ ఒమిక్రాన్ వెంటాడుతుంది. సొమవారం ఒక్కరోజే 14,17,493 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత వారం రోజులుగా సగటున రోజుకు 7,75,489 మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రతి సెకనుకు 9 మందికి పాజిటివ్గా నిర్థారణ అవుతోంది. నిన్న ఒక్కరోజు 1,673మంది మృతి చెందారు.
అస్పత్రులలో చేరేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రులపై ఒత్తిడి తీవ్రత పెరిగింది. నిన్న ( సోమవారం ) ఒక్క రోజు కరోనా, ఒమిక్రాన్ సోకిన 1,41,385 మంది ఆస్పత్రులలో చేరారు. గత ఏడాది జనవరి 14న రికార్డు స్థాయిలో 1,42,273 మంది ఆస్పత్రులలో చేరారు. ఈసంఖ్యను ఒకటి రెండు రోజుల్లోనే దాటే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
మరో రెండు మూడు వారాల్లో రెట్టింపు కేసులు
అమెరికాలో సెకండ్ వేవ్ సమయంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు తాజా పెరుగుతున్న కేసులను చూస్తే మరింత భయాందోళన నెలకొంది. మరలా గతేడాది పరిస్థితి నెలకొంది. మున్ముందు కరోనా మహమ్మారి మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు వారాల్లో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 3 లక్షల దాక ఉండవచ్చని పేర్కొంటున్నారు.
ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధింపు
మరోవైపు అమెరికాలోని లూసియానా, మేరిల్యాండ్, వర్జీనియా, కొలొరాడో, ఒరిగాన్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కరోనా కేసుల తాకిడి పెరడంతో ఆస్పత్రులపై ఒత్తిడి పడింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కరోనా బారిన పడ్డవారి సంఖ్య ఎక్కువగా చికిత్స అందించే సిబ్బంది తక్కువగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో 1,200 ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత వెంటాడుతోంది. మరో వారం రోజుల్లో 100 ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ వెల్లడించింది.
ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత
ఒకవైపు కరోనా బారిన పడి అస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుంటే .. వారికి వైద్యం అందించేందుకు సిబ్బంది లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ సోకి ఎలాంటి లక్షణాలు లేకపోతే.. వారు ఎన్ 95 మాస్కు ధరించి విధులకు హాజరుకావాలని సూచించింది. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 1 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. అధికారుల తీరుపై కాలిఫోర్నియా నర్సెస్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. కరోనా వైరస్ సోకిన వైద్య సిబ్బంది విధుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది.