ఐసిస్ పనిపడుతోన్న ఇరాక్ : గడ్డాలు తీసి మరీ పారిపోతున్న ఉగ్రవాదులు
బాగ్దాద్ : ఐసిస్ చేతిలోకి వెళ్లిపోయిన మోసుల్ నగరాన్ని ఉగ్రవాదుల కబంధ హస్తాల్లో నుంచి విడిపించడానికి ఇరాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నగరాన్ని మూడువైపుల నుంచి చుట్టుముట్టిన ఇరాక్ కుర్దీష్ సంయుక్త దళాలు.. ఉగ్రవాదులపై దాడులు జరుపుతూ.. మెల్లిగా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఇప్పటికే ఐదు కి.మీ మేర మోసుల్ నగరంలోకి చొచ్చుకెళ్లిన ఇరాక్ సేనలు.. చాలామంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దీంతో ఇరాక్, కుర్దీష్ సేనల దూకుడు చూసి ఐసిస్ జిహాదీలు బెంబేలెత్తిపోతున్నారు. వీలైనంత త్వరగా నగరాన్ని వీడి పారిపోవాలనే నిర్ణయానికి వచ్చిన ఉగ్రవాదులు.. తమ స్థావరాలను మార్చేయడంతో పాటు గడ్డాలు తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సాధారణ జనంలో కలిసేందుకు యత్నిస్తున్నారు.
ఇంకొందరు ఐసిస్ ఉగ్రవాదులు సిరియా ఉత్తరవైపుకు పారిపోతున్నట్లుగా తెలుస్తోంది. మోసుల్ నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక.. ఐసిస్ కు అడ్డాగా మారిన రక్కాపై దాడి చేయాలనే లక్ష్యంతో ముందడుగువేస్తున్నాయి భద్రతా బలగాలు. రక్కాపై దాడి ద్వారా ఐసిస్ ను నామరూపాల్లేకుండా చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కాగా, నిరంతరం కొనసాగుతున్న దాడుల వల్ల ఇప్పటిదాకా 10వేల మంది మోసుల్ నగర ప్రజలు.. మోసుల్ నుంచి వేరే చోటుకు తరలిపోయినట్లుగా సమాచారం.