కొడుకు మునిగిపోతుంటే ఫేస్బుక్ మోజులో తల్లి
లండన్: నిర్లక్ష్యంగా వ్యవహరించి కుమారుడి మరణానికి కారణం అయ్యిందని ఆరోపిస్తు ఓ తల్లికి బ్రిటన్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన కుమారుడి మరణానికి తానే కారణమని ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి జైలు శిక్ష విధించామని కోర్టు చెప్పింది.
తూర్పు యార్క్ షేర్ లోని బెవర్లీలో నివసించే క్లెయిర్ బార్నెట్ (31) అనే మహిళ జైలుకు వెళ్లింది. బార్నెట్ కు జాషువా (2) అనే కుమారుడు ఉన్నాడు. 2014వ సంవత్సరం మార్చి 17వ తేదిన ఇంటి ఆవరణలోని తోటలో ఆడుకుంటున్న జాషువా ఆకస్మికంగా స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు.
ఇంటి ఆవరణంలో గార్డెన్ లోనే ఉన్న బార్నెట్ కుమారుడి గురించి పట్టించుకోకుండా తన స్మార్ట్ ఫోన్ తో ఫేస్ బుక్ లో కాలక్షేపం చేసింది. సోషల్ మీడియా మోజులో పడి కుమారుడి గురించి మరిచిపోయింది. తరువాత కుమారుడు స్విమ్మింగ్ పూల్ లో గిలగిల్లాడుతున్న విషయం గుర్తించింది.
వెంటనే కుమారుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించింది. చికిత్స విఫలమై అదే రోజు జాషువా మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సందర్బంలో బర్నెట్ గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి.
గతంలోనే తన కుమారుడిని నిర్లక్ష్యంగా వదిలి వెయ్యడంతో ఆడుకుంటూ ఇంటి నుంచి రోడ్డు మీదకు వెళ్లిన జాషువాను కారు డీకోట్టబోయిందని, అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు అన్నారు.
బార్నెట్ చేసిన పనిని బాలల హింసగా పరిగణించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ చేసిన బ్రిటన్ కోర్టు బార్నెట్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు బార్నెట్ ను జైలుకు పంపించారు.