పాలస్తీనాలో భారత రాయబారి మృతి - అనుమానాస్పదస్థితిలో : భారత్ కు తరలిచేందుకు..!!
పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామల్లాహ్లోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా కనిపించారు. భారత రాయబారి ముకుల్ మృతిపై పాలస్తీనా అగ్రశ్రేణి నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్ మృతిచెందాడన్న వార్త తెలియగానే ఆదేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయే భద్రత, పోలీసు, ఆరోగ్య, ఫోరెన్సిక్ అధికారులను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకొని ఆయన మరణానికి సంబంధించి నిశిత పరిశీలన చేయాలని ఆదేశించించింది. ముకుల్ ఆర్య చనిపోయిన విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయ్శంకర్ ధ్రువీకరించారు. విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. అందులో.. రమల్లాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను ఎంతో తెలివైన, ప్రతిభావంతమైన అధికారి. ముకుల్ కుటుంబానికి, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు.
2008 బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్కు చెందిన ముకుల్ ఆర్య దిల్లీలోని జవహర్లాల్ యూనివర్సిటీలో చదివారు. ముకుల్ అంతకుముందు కాబుల్, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ప్యారిస్లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో సైతం పనిచేశారు. ముకుల్ మరణం పట్ల పాలస్తీనా విదేశాంగశాఖ మంత్రి రియాద్ అల్ మాలికీ భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్కు, భారత ప్రభుత్వానికి, ఆర్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు.
Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022
He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones.
Om Shanti.
ఇటువంటి క్లిష్ట, కఠిన పరిస్థితుల్లో అన్నిరకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముకుల్ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది.