కరోనా వ్యాక్సిన్పై WHO కీలక ప్రకటన - ట్రయల్స్ నిలిపివేత మేలుకొలుపన్న సౌమ్య
తొమ్మిది నెలలుగా భూగోళాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే తొమ్మిది లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వస్తే తప్ప వైరస్ వ్యాప్తి అంతం కాదనే వాదన బలపడుతోన్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కీలక ప్రకటన చేసింది. మహమ్మారిని నివారించడానికి సహాయపడే ఉత్పత్తులను వేగవంతం చేయాలని, అందుకోసం అన్నిరకాల వనరులను వాడుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ కు సంబంధించి డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామనాథన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనాకు సంబంధించి ''యాక్ట్ యాక్సిలరేటర్'' ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే సంభావ్య టీకాలు, మందుల పరిశోధనలకు డబ్ల్యూహెచ్వో తనవంతు సహకారం అందిస్తున్నదని, దేశాలన్నీ వ్యాక్సిన్ల తయారీ, క్లినికల్ ట్రయల్స్, నియంత్రణకు సంబంధించిన అనుమతుల జారీలో వేగం పెంచాలని, అప్పుడు మాత్రమే కరోనాకు మరింత మంది బలికాకుండా కాపాడుకోగలమని డబ్ల్యూహెచ్వో చీఫ్ అథనామ్ అన్నారు. గురువారం జెనీవా నుంచి ఆన్ లైన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 వ్యాక్సిన్లు అభివృద్ధి దిశలో ఉన్నాయని, వాటిలో 35 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డెక్సామెథాసోన్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న రోగులపై డెక్సామెథాసోన్ సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. చరిత్రలో ఏ వ్యాధి కూడా కోవిడ్ తరహాలో వేగంగా విస్తరించలేదని తమ పరిశోధనలు తేలిందని అథనామ్ అన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్న ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడాన్ని మేలుకొలుపుగా అభివర్ణించారు డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎలాంటి హెచ్చుతగ్గులుంటాయోనని గుర్తించడానికి ఇదొక సందర్భమని, అంతమాత్రాన సైంటిస్టులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.