పాకిస్తాన్ లో గాయత్రి మంత్రాలాపన.. ముగ్ధుడై చప్పట్లు కొట్టిన నవాజ్ షరీఫ్
పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ గాయత్రి మంత్రాలాపనను శ్రద్ధగా విని చప్పట్లతో తన హర్షం వ్యక్తం చేశారు.
కరాచీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొలువుదీరిన ఓ కార్యక్రమంలో హిందూ యువతి చక్కగా గాయత్రి మంత్రం ఆలాపించి అందరి హృదయాలను దోచుకుంది. అక్కడ ఉన్న అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు దానిని శ్రద్ధగా విన్న ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చప్పట్లతో తన హర్షం వ్యక్తం చేశారు.
ఈనెల 15న పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులు హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయగా, దానికి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో తొలుత మాట్లాడిన ఆయన హిందువులకు అన్ని రకాలా రక్షణ కల్పిస్తామని చెప్పారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడాన్ని ఖురాన్ అంగీకరించబోదని, పాక్ లో మైనారిటీల హక్కులు కాపాడడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం నరోదా మాలిని అనే యువతి గాయత్రి మంత్రాన్ని ఆలపించి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేదికపై ఉన్న వారంతా కూడా అలౌకికానందానికి లోనై, మంత్రాలాపన పూర్తిగా విని చప్పట్లతో అభినందించారు.