చందమామకు అవతలి వైపు - 50 ఏళ్ల రికార్డు బద్దలు..!!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. అప్పుడెప్పుడో అపోలో మూన్ మిషన్ తరువాత ఇప్పుడు మళ్లీ చంద్రమండలాన్ని అందుకుంది. 50 సంవత్సరాల తరువాత చందమామను మరోసారి ముద్దాడింది. నాసా తాజాగా ప్రయోగించిన ఒరియన్ క్యాప్సుల్.. చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. దాని చుట్టూ చక్కర్లు కొడుతోంది.
అప్పట్లో అపోలో..
1972లో తొలిసారిగా నాసా అపోలో మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. దాన్ని విజయవంతంగా ముగించింది. ఇప్పుడు మళ్లీ ఒరియన్ క్యాప్సుల్ ప్రాజెక్ట్ను టేకప్ చేసింది. దాన్నీ సక్సెస్ఫుల్గా మలిచింది. ఒరియన్ క్యాప్సుల్ను కిందటి వారమే ప్రయోగించారు నాసా శాస్త్రవేత్తలు. ఈ ప్రాజెక్ట్ వ్యయం 4.1 బిలియన్ డాలర్లు. ఇందులో డమ్మీ అంతరిక్ష పరిశోధకులను అమర్చారు. డమ్మీ ఆస్ట్రోనాట్లతో మిషన్ మూన్ను చేపట్టడం నాసా శాస్త్రవేత్తలకు ఇదే తొలిసారి.
సెకెనుకు 160 కిలోమీటర్లు..
ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి దీన్ని చంద్రుడిపైకి పంపించింది. 32 అంతస్తుల ఎత్తు ఉండే రాకెట్ ద్వారా ఒరియన్ క్యాప్సుల్ను నింగిలోకి సంధించింది. సెకెనుకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందీ రాకెట్. తాజాగా చంద్రమండలంలో అడుగు పెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. నాసా ప్రయోగించిన ఓ క్యాప్సుల్.. చందమామపై ల్యాండ్ కావడం 50 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం భూమికి 3,70,000 కిలోమీటర్ల ఎత్తున తిరుగాడుతోంది ఈ క్యాప్సుల్.
తొలుత బ్లాక్ అవుట్..
ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఫ్లైట్ డైరెక్టర్ జ్యూడ్ ఫ్రీలింగ్ ప్రకటించారు. ఈ మిషన్ కంట్రోలింగ్ సెంటర్ హ్యూస్టన్ ఎస్ జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ క్యాప్సుల్ గమనాన్ని పర్యవేక్షిస్తోన్నట్లు చెప్పారు. కాగా- చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కొద్దిసేపు బ్లాక్ అవుట్ ఏర్పడింది. గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి. దీనితో శాస్త్రవేత్తల్లో ఆందోళన నెలకొంది. ఇంజిన్ ఫైరింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని తొలుత భావించారు.
చంద్రుడి అవతలి వైపు..
అరగంట తరువాత కమ్యూనికేషన్స్ ఏర్పడినట్లు ఒరియన్ ప్రోగ్రామ్ మేనేజర్ హొవర్డ్ హ్యూ తెలిపారు. కమ్యూనికేషన్స్ ఏర్పడిన వెంటనే క్యాప్సుల్ నుంచి మొట్టమొదటి ఫొటో అందిందని చెప్పారు. చంద్రుడి ఆవలి వైపునకు ఈ క్యాప్సుల్ వెళ్లిందని, అక్కడి నుంచి భూమిని ఫొటో తీసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో మానవ సహిత మిషన్ను చేపట్టే అవకాశాలు మరింత మెరుగయ్యాయని వ్యాఖ్యానించారు.