మిడతల దాడితో పాక్ గజగజ.. నేషనల్ ఎమర్జెన్సీ విధింపు.. భయం అంచున భారత్..
కూడబలుక్కున్నట్లు లక్షల సంఖ్యలో మిడతలు ఒక్కసారే ఊరిమీదపడతాయి.. చూస్తుండగానే పంటపొలాలను నాశనం చేసిపారేస్తాయి.. అక్కణ్నుంచి పక్క ఊరు.. అలా మొత్తం మూడు రాష్ట్రాల్లోని రైతాంగాన్ని ఆగం చేశాయా మాయదారి మిడతలు.. అప్రమత్తమైన ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పుడా మిడతల దండు పక్కనే ఉన్న భారత్లోకీ చొరబడే అవకాశముంది..
25లక్షల ఎకరాల పంటలకు దెబ్బ
మిగతా ప్రపంచం కరోనా వైరస్ కు వైణికిపోతుంటే.. దాయాది పాకిస్తాన్ మాత్రం మిడతల దాడితో గజగజలాడుతోంది. పాక్ ధాన్యాగారంగా పేరుపొందిన పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో పంటపొలాలపై మిడతల దండు విరుచుకుపడటంతో విపత్తు పరిస్థితి నెలకొంది. సింధ్, దక్షిణ పంజాబ్, ఖైబర్ పష్తూన్ ఖ్వా ప్రాంతాలలో దాదాపు 25 లక్షలకు పైగా ఎకరాల విస్తీర్ణంలోని పంటలు, చెట్లను మిడతలు నాశనం చేశాయి.
నేషనల్ ఎమర్జెన్సీ
మంచి పంటలు పండే రాష్ట్రాలపై మిడతల దాడితో పాక్ ఆర్థికవ్యవస్థను అతలాకుతలమయ్యే అవకాశాలుండటంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకిదిగారు. శనివారం ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. మిడతల్ని తరిమికొట్టేందుకు అవసరమైన చర్యల్ని వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
ఎక్కడివీ మిడతలు?
పాక్ ఎడారి ప్రాంతంలో జీవించే మిడతల దండు ఎప్పుడోగానీ ఇలా పంటపొలాలపై దాడులు చేయవు. చివరిసారి 1993లో ఇదే తరహా ఉపద్రవం తలెత్తింది. ఒక్కసారే లక్షల సంఖ్యలో విరుచుకుపడే మిడతల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన సాధనాలేవీ పాక్ గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారేందుకు కారణమైంది. మిడతల్ని పారదోలే పరికరాల్ని చైనా నుంచి తెప్పించుకే ప్రయత్నంలో ఉన్నారుజ
మోదీకి కెప్టెన్ లేఖ
పాకిస్తాన్ లో నేషనల్ ఎమర్జెన్సీ విధించేంత స్థాయిలో మిడతలు బీభత్సం సృష్టిస్తుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. పాక్ ప్రభుత్వం మిడతల్ని నియంత్రించకుంటే అవి ఇండియాలోని పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లోనూ పంటల్ని దెబ్బతీసే అవకాశముందని, ఈ మేరకు తక్షణమే ఇమ్రాన్ పై ఒత్తిడిపెంచాలని సీఎం తన లేఖలో ప్రధానిని కోరారు. గతేడాది మార్చిలోనూ పాక్ వైపు నుంచి భారీ సంఖ్యలో మిడతలు భారత్ లోకి ప్రవేశించగా, మన అధికారులు సకాలంలో చర్యలు చేపట్టడంతో నష్టం తీవ్రత తగ్గింది. ఇప్పుడు మాత్రం మిడతల సంఖ్య ఎక్కువగా ఉండటం అందరిలో భయం రేపుతోంది.