అవినీతి కేసులో నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష, కూతురుకు ఏడేళ్లు
కరాచీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన కూతురు మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియంను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో ఈ శిక్ష పడింది.
కోర్టు 1 జడ్జి మొహమ్మద్ బషీర్ శుక్రవారం నాడు ఈ తీర్పు చెప్పారు. నవాజ్ షరీఫ్ అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఉదయం నుంచి మూడుసార్లు వాయిదా అనంతరం ఈ తీర్పును వెలువరించారు. నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రస్తుతం లండన్లో ఉంది. ఎన్నికలకు ముందు ఈ తీర్పు రావడం గమనార్హం.
పనామా స్కాంలో బయటపడిన నవాజ్ షరీఫ్ అవినీతిపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించింది. షరీఫ్పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్ అవెన్ఫీల్డ్లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు.
ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది. శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్ షరీఫ్ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు. మరియంకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.
తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కోర్టు ప్రసారాలను లండన్ నుంచి షరీఫ్ ఫ్యామిలీ తిలకించారని తెలుస్తోంది.