చైనాపై తన వైఖరిని స్పష్టం చేసిన జో బిడెన్: ఆ పరిస్థితే వస్తే..ఎందాకైనా: ఈ నాలుగేళ్లలో ఏదైనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో డ్రాగన్ కంట్రీ చైనాపై కఠినంగా వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. ఓ రకంగా వాణిజ్యపరమైన యుద్ధానికి తెర తీశారు. భారత్ తరహాలోనే కొన్ని రకాల యాప్లపై నిషేధాన్ని విధించారు. చైనీయుల రాకపోకలపైనా ఆంక్షలను తీసుకొచ్చారు. దౌత్యపరంగా ఆ ఆంక్షలను మరింత విస్తరింపజేశారు. చైనా దుందుడుకు చర్యలను అడ్డుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి రాజీధోరణినీ కనపర్చలేదు. ఫలితంగా అమెరికా-చైనా మధ్య నెలకొన్న దౌత్య, వాణిజ్య, విదేశాంగ సంబంధాలు దాదాపు తెగే దశకు చేరుకున్నాయి.
నాలుగు అతిపెద్ద సంక్షోభాలు: జనవరి నుంచి అదే పని: జో బిడెన్ కొత్త టాస్క్: నో టైమ్ టు వేస్ట్
ట్రంప్ హయాంలో కఠినంగా..
ప్రస్తుతం అమెరికాలో ప్రభుత్వం మారబోతోంది. డొనాల్డ్ ట్రంప్ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ అధికారంలోకి రాబోతోన్నారు. వచ్చేనెల 20వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అగ్రరాజ్యం అమెరికా.. తాను శతృవుగా భావిస్తోన్న చైనాతో మున్ముందు ఎలాంటి సంబంధాలు, ఒప్పందాలను కుదుర్చుకుంటోందనే ఆసక్తి భారత్లోనూ వ్యక్తమౌతోంది.
చైనాపై బిడెన్ వైఖరి ఇదీ..
దీనికి కొత్త అధ్యక్షుడు జో బిడెన్ తెర దించారు. చైనా పట్ల తన వైఖరేమిటో తేల్చి చెప్పారు. తన నాలుగేళ్ల హయాంలో చైనాతో ఎలా వ్యవహరిస్తాననే విషయంపై స్పష్టతనిచ్చారు. చైనా దుందుడుకు చర్యలకు పోతోందనే విషయాన్ని నిర్ధారించారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ దేశాలు కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనా పట్ల వ్యతిరేకత, భావసారూప్యం గల దేశాలు జోక్యం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాంటి కూటమిలో తాము చేరడానికి సన్నద్ధంగా ఉన్నామని జో బిడెన్ తేల్చి చెప్పారు. అలాంటి దేశాలు తమతో కలిసి రావాలనీ పిలుపునిచ్చారు.
భద్రత.. విదేశాంగ విధానాలపై
జాతీయ భద్రత, విదేశాంగ విధానాలపై తన టీమ్ సభ్యులతో ఆయన ఓ సమీక్షను నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చైనాతో అనుసరించాల్సిన వైఖరిపైనే చర్చించారు. తాము చైనా నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నామని జో బిడెన్ స్పస్టం చేశారు. వాణిజ్యం, టెక్నాలజీ, మానవ హక్కులు వంటి వివిధ రంగాల్లో చైనా కట్టుతప్పుతోందని, దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాను నియంత్రించడానికి భావసారూప్యం గల దేశాలు తమతో కలిసి రావాల్సిన అవసరం ఉందని, ఓ కూటమిగా ఏర్పడాలని చెప్పారు.
Recommended Video
దారికొస్తే.. పునఃసమీక్షించుకుంటాం..
అలాంటి ప్రజాస్వామ్య దేశాల ఎకానమీ మరింత బలపడటానికీ ఇది ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. చైనాతో పోల్చుకుంటే.. తాము అనేక రంగాల్లో బలంగా ఉన్నామని జో బిడెన్ గుర్తు చేశారు. ప్రపంచ ఎకానమీలో తమ వాటా 25 శాతంగా ఉంటోందని చెప్పుకొచ్చారు. చైనా దారికి వస్తే.. ఆ దేశంతో సత్సంబంధాలను నెలకొల్పుకునే విషయాన్ని పునఃసమీక్షించుకుంటామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆ దేశానికి కళ్లెం వేయడంపైనే దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను నెరపడానికే ఎవరైనా మొగ్గు చూపుతారని వ్యాఖ్యానించారు.