నల్లసూర్యుడు అస్తమయం: మండేలా కన్నుమూత
జోహెన్నెస్బర్గ్: నల్లసూర్యుడు అస్తమించాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన నెల్సన్ మండేలా గుండె ఆగిపోయింది. మండేలా తన 95 యేట ఈ ప్రపంచాన్ని వీడి వదిలిపోయారు. దీర్షకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఇక రానంటూ వెళ్లిపోయారు. గురువారం అర్థరాత్రి ఆయన కన్నుమూశారు.
నెల్సన్ మండేలాకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా. ఆయన 1994 - 99 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు 25కు పైగా అవార్డులు వచ్చాయి.
నెల్సన్ మండేలా తుది శ్వాస విడిచిన విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని అన్నారు. అధికారిక లాంఛనాలతో మండేలా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని ఆదేశించారు.
ఆయన 27 ఏళ్లు ఆయన జైలులోనే గడిపారు. మహాత్మా గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలే తనకు స్ఫూర్తినిచ్చాయని మండేలా పలుమార్లు చెప్పుకున్నారు. తెల్లజాతి అధికారానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు.
మండేలా 1918 జులై 18వ తేదీన కేప్ ప్రాంతంలోని తెంబూ వంశానికి చెందిన కుటుంబంలో జన్మించారు. విద్యార్థిదశలోనే వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడయ్యాడు. ఆయనకు ఆరుగురు సంతానం.