దృఢంగా ఆలయం: గుడారంలో నేపాల్ అధ్యక్షుడు, దెబ్బతిన్న భవనం
ఖాట్మాండ్: భూకంప ధాటికి నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ అధికారిక నివాసంలో పలుచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయన కూడా ఓ గుడారంలో ఉన్నారు. శనివారం రాత్రంతా ఆయన దానిలోనే గడిపారు. అధ్యక్ష నివాస భవనం శీతల్ నివాస్. దీనిని బ్రిటిష్ తరహా నిర్మాణ శైలిలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు.
ప్రధాన భవనంలో కొన్ని గదులు, వంట గదిలో పగుళ్లు వచ్చాయి. దీంతో అతను గుడారంలోనే గడిపారు. నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా నివాసం కూడా భూకంప ధాటికి తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన ప్రవేశ మార్గం ధ్వంసమైంది. భూకంపం వచ్చిన సమయంలో సుశీల్ కోయిరాలా ఇండోనేషియాలో ఉన్నారు. మరోవైపు, చారిత్రక పశుపతినాథ్ ఆలయం చెక్కు చెదరని విషయం తెలిసిందే.
చేయూత మా బాధ్యత
గత ఎనభై సంవత్సరాల్లో ఎన్నడూ చవిచూడనంత ప్రళయ భూకంప సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్ను శాయశక్తులా ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆదివారం హామీ ఇచ్చారు. ఈ సంక్షోభ పరిస్థితులను అధిగమించేలా నేపాల్కు చేయూతనిస్తామని, అన్నివిధాలుగా సహాయ సహకారాలను అందిస్తామన్నారు.
అంతర్జాతీయంగా సహాయ సంక్షేమ చర్యలను సమన్వయ పరుస్తూ నేపాల్కు వెన్నుదన్నుగా నిలుస్తామని తెలిపారు. ఇంకా ఎంతమంది మరణించారు, ఎంతగా నష్టం వాటిల్లిందన్న దానిపై స్పష్టమైన అంచనాకు రాలేని పరిస్థితుల్లో నేపాల్కు మరింతగా సహాయాన్ని అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా గట్టి ప్రయత్నాలే మొదలయ్యాయన్నారు.
ముఖ్యంగా నేపాల్ సాంస్కృతిక, వారసత్వ సంపదకు కలిగిన నష్టం పూడ్చలేనిదేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భూకంపంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ప్రాణాలను కాపాడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలని కోరారు. క్షతగాత్రులను, మృతదేహాలను వెలికితీసే విషయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితిని అధిగమించేలా అంతర్జాతీయ బృందాలను పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైద్య బృందాలను, సరఫరాలను కూడా నేపాల్కు తరలించాలన్నారు.