నేపాల్ విమాన దుర్ఘటనలో మరో కోణం-కో పైలట్ భర్త కూడా పైలటే-16 ఏళ్ల క్రితం ఇదే తరహాలో మరణం..
నిన్న నేపాల్లోని పొఖారా ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ప్రయాణికులతో పాటు పైలట్, కో పైలట్ కూడా ఉన్నారు. అయితే మహిళా కో పైలట్ అంజూ ఖతివాడా విషయంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త, పైలట్ అయిన దీపక్ పోఖ్రెల్ 16 ఏళ్ల క్రితం జరిగిన విమాన ప్రమాదంలో ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు.
2006లో నేపాల్లోని యతీ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ చిన్న ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కుప్పకూలింది. ఇందులో విమానం నడుపుతున్న పైలట్ దీపక్ పోఖ్రెల్ చనిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2010లో దీపక్ బాటలోనే పైలట్ కెరీర్ ఎంచుకున్న ఆయన భార్య అంజూ ఖతివాడా యతీ ఎయిర్ లైన్స్ లో చేరారు. అప్పటి నుంచి యతీ ఎయిర్ లైన్స్ కు పైలట్ గా పనిచేస్తున్న అంజూ నిన్న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.
అంతకు మించి మరో విషయం అంజూ జీవితంలో చోటు చేసుకుంది. తన భర్త దీపక్ పోఖ్రెల్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతోనే ఆమె ట్రైనింగ్ తీసుకుని పైలట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూయడంతో ఆ కుటుంబంలో విషాదం మిన్నంటింది. వాస్తవానికి అంజూకు 6400 గంటలు విమానం నడిపిన చరిత్ర ఉంది. ప్రమాదం జరిగిన ఖాట్మండు-పొఖారా రూటులోనే ఆమె వేల గంటలు విమానం నడిపారు. తాజా ప్రమాదంలో మృత్యువాత పడిన పైలట్ కేసీ కమాల్ మృతదేహం దొరికినా అంజూ మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆమె చనిపోయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.