నేపాల్ ఎన్నికలు: ప్రచండ ఓటమి, ఆందోళనలు
ఖాట్మాండ్: మావోయిస్టు పార్టీ అధినేత ప్రచండ నేపాల్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రాజన్ కెసి చేతిలో ఆయన పరాజయం చెందారు. అయితే ఎన్నికల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపిస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి పలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపులో, ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయని ప్రచండ(పుష్ప కమల్ దహల్) గురువారం ఆరోపించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని, అలా చేయని పక్షంలో రాజ్యాంగ పరిషత్తును తమ పార్టీ బహిష్కరిస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల తర్వాత కొన్ని బ్యాలెట్ బాక్సులు కనిపించకుండా పోయాయని, బాక్సులు తరలించిడంలో కూడా పలు అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.
మావోయిస్టు పార్టీకి కంచుకోటగా భావించే ఖాట్మాండ్ 10 నియోజకవర్గాల్లో ఒకటైన సిరాహా నుంచి పోటీ చేసిన ప్రచండ ఎన్నికల ఫలితాలలో మూడవ స్థానంలో నిలవడంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తమకు పూర్తిస్థాయి మద్దతు ఉన్న నియోజకవర్గంలో ఓడిపోయామంటే ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని ప్రచండ ఆరోపించారు.
ఇదే నియోజక వర్గం నుంచి 2008 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తాము ఈ ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. కాగా నేపాల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీల్ కుంఠ ఉప్రేఠి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపును ఆపివేసే ప్రసక్తి లేదని అన్నారు.