నేపాల్లో కొత్త లౌకిక రాజ్యాంగం: ఆందోళనలు, మృతి
ఖాట్మాండ్: నేపాల్లో పూర్తిస్థాయి లౌకిక, ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని దేశ పార్లమెంటు ఆదివారం నాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రాజ్యాంగం పైన ఏడేళ్ల సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్ భరణ్ యాదవ్ ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటైన సభలో ప్రవేశ పెట్టారు.
రాజ్యాంగం 2072గా పేర్కొన్న నూతన రాజ్యాంగానికి పార్లమెంటులోని మొత్తం 601 మంది సభ్యుల్లో ఎక్కువ మంది ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రామ్ భరణ్ మాట్లాడారు.
‘రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొంది.. దాని చైర్మన్ ధ్రువీకరించిన లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం 2015 సెప్టెంబర్ 20నుంచి అమలులోకి వస్తోందని ప్రకటిస్తున్నాను' అని దేశాధ్యక్షుడు యాదవ్ ప్రకటించారు.

ఈ చారిత్రక సమయంలో దేశ రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత, సహకారం ఎంతో అవసరమన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణ లక్ష్యాలకు కొత్త రాజ్యాంగం ఉద్దీపన కావాలన్నారు.
‘రాజ్యాంగం 2072'పేరిట చేపట్టిన ఈ చారిత్రక పత్రం సమాఖ్య విధానాన్ని వ్యవస్థీకరించిందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ రాజ్యాంగం దోహదం చేయగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడానికీ కూడా ఈ రాజ్యాంగం ఉపకరించగలదన్నారు.
కొత్త రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లోని 601మంది సభ్యుల్లో 85శాతం మంది ఆమోదించారు. రెండు సభలుగా పార్లమెంట్ పని చేస్తుంది. దిగువ సభ లేదా ప్రతినిధుల సభలో 475మంది సభ్యులు, ఎగువ సభలో 60మంది సభ్యులు ఉంటారు. రాజ్యాంగంలో 37 విభాగాలు, 304 అధికరణలు, ఏడు అనుబంధాలు ఉంటాయి. ఏడాదిలోగా దేశంలోని ఏడు రాష్ట్రాలను ఉన్నత స్థాయి కమిషన్ ఖరారు చేస్తుంది.
దేశాన్ని ఏడు రాష్ట్రాలుగా విభజిస్తూ కొత్త రాజ్యాంగాన్ని చేపట్టడాన్ని మైనార్టీ మాధేసీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ వీరు చేపట్టిన ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించాడు. రాజ్యాంగాన్ని చేపట్టడానికి ముందు నుంచీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశ వ్యాప్తంగా అన్ని కీలక కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేపాల్లో ఆందోళనలుక కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications