నా కుమారుడ్ని చంపేందుకు ఇరాన్ ప్రయత్నించింది: నెతన్యాహు సంచలనం
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. నా ఇద్దరు కుమారుల్లో ఒకరిని హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ వేసిందని అన్నారు. ఇజ్రాయెల్ న్యూస్ ఛానెల్ 14 కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. " ఎన్నడూ ఊహించనిది.. అనుకోనిది జరిగింది. నా ఇద్దరు కుమారుల్లో ఒకరిని ఇరాన్ చంపేందుకు ప్లాన్ వేసింది. ఇరాన్ నా కుమారుల్లో ఒకరిని చంపాలని ప్రయత్నం చేసింది" అని స్పష్టం చేశారు.
నెతన్యాహుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు యైర్, అవ్నేర్ లు.. వీరిలో ఎవరిని ఇరాన్ చంపేందుకు ప్రయత్నించిందో నెతన్యాహు స్పష్టతనివ్వలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక అందించిన సమాచారం ప్రకారం అవ్నేర్ ప్రస్తుతం ఇజ్రాయెల్ లో నివాసం ఉంటున్నారు. యైర్ కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. ఆయన కొన్నేళ్లపాటు మియామిలో నివాసం ఉన్నారు. ఆయన రైట్ వింగ్ వ్యూస్, కామెంటేటర్ గా గుర్తింపు పొందారు. ఇక నెతన్యాహు సోమవారం ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరోపణలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టు అమిత్ సీగల్ తన టెలిగ్రామ్ ఖాతాలో కీలక విషయాన్ని పోస్టు చేశారు.

నెతన్యాహు కుమారులను హతమార్చాలని ఇరాన్ కొన్ని నెలల నుంచే పథకం రచించిందని అన్నారు. కానీ అనుకోని పరిణామాల కారణంగా అది ముందుకు సాగలేదని తెలిపారు. జెరుసలేం పోస్ట్ ప్రకారం.. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన షిన్ బెట్ నెతన్యాహు కుటుంబానికి భద్రతను పొడిగించింది. నెతన్యాహు భార్య, వారి పిల్లలకు ఈ భద్రత ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.












Click it and Unblock the Notifications