మరిన్ని కుల ఉద్యమాలు: 'న్యూయార్క్ టైమ్స్' జోస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జెఎన్యూలో జరిగిన రగడ విద్యార్ధుల స్వేచ్ఛను హరించే విధంగా ఉందంటూ ప్రముఖ అమెరికన్ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ తన ఎడిటోరియల్లో మండిపడింది. అంతేకాదు భారత్లో త్వరలో మరిన్ని కుల ఉద్యమాలు పుట్టుకొస్తాయని అందులో జోస్యం చెప్పింది.
న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ప్రత్యేక కథనంలో "రాజధాని ఢిల్లీ నగరానికి మంచినీరు అందడం లేదు. వందలాది రైళ్లు నిలిచిపోయాయి. 300 కిలోమీటర్ల విమాన ప్రయాణానికి రూ. 50 వేలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి. తమకు ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్ కులస్తులు హింసకు దిగడంతో ఏర్పడిన పరిస్థితి ఇది. జాట్ల రిజర్వేషన్కు ప్రభుత్వం అంగీకరిస్తే, భారత్లో మరిన్ని కుల ఉద్యమాలు పుట్టుకొస్తాయి" అని అందులో పేర్కొంది.
ఓట్ల కోసం రాజకీయ పార్టీలు సమాజంలోని పేద వర్గాలను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తూ, వారికి 50 శాతం రిజర్వేషన్లను దగ్గర చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అగ్రవర్ణాల్లో కూడా పేదవారు ఉండటం, ఉన్నత విద్య, ఉద్యోగాలకు దూరం కావడంతోనే వారంతా ఉద్యమాల బాట పడుతున్నారని పేర్కొంది.
భారత్లోని వివిధ రాష్ట్రాల్లోని 2000కు పైగా కులాలు వెనుకబడిన తరగతుల్లో ఉన్నాయని వివరించింది. ఓట్ల కోసం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాట్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమని చెప్పిందని, అయితే దానిని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అడ్డుకుందని పేర్కొంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పటేల్ వర్గం కూడా ఇదే తరహా ఉద్యమం చేశారని గుర్తు చేసింది. ఇటీవలే ఏపీలో జరిగిన కాపు ఉద్యమాన్ని సైతం ప్రస్తావించింది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహించిన కాపు ఉద్యమం హింసాత్మకంగా మారి ఓ రైలును తగలబెట్టిన సంగతి తెలిసిందే.
ఇలా భారత్లో రిజర్వేషన్ల సమస్యను తీవ్రంగా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా చేయని పక్షంలో భారత్లో కొత్త కుల ఉద్యమాలు పుట్టుకొస్తాయని న్యూయార్క్ టైమ్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని కన్నయ్య కుమార్ను అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.