భారత్ సమర్థతకు సముచిత గౌరవం: ఆపత్కాలంలో WHO కిరీటం,అందరి చూపు అటువైపే..!
జెనీవా: ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనావైరస్ కుదిపేస్తోంది. దాదాపు 200 దేశాలపై ఈ మహమ్మారి పంజా విసిరింది. కంటికి కనిపించకుండానే దాడి చేస్తూ లక్షకు పైగా ప్రాణాలను తీసింది. ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన విపత్తు వచ్చిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటి కీలక సంస్థలో భారత్ తనదైన పాత్ర పోషించే అవకాశం దక్కనుంది.
ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్పర్సన్గా భారత్కు చెందిన వ్యక్తి..?
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే మార్గదర్శకాలను ఆయా దేశాలు ఫాలో కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా డాక్టర్ టెడ్రాస్ అధానమ్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈయనకు సలహాలు సూచనలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ బోర్డు. ఈ బోర్డులో మొత్తం 34 మంది సభ్యులు ఉంటారు. ఈ బోర్డుకు జపాన్ నాయకత్వం వహిస్తోంది.
అంటే ఈ బోర్డు ఛైర్పర్సన్గా జపాన్కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ బోర్డు ఛైర్పర్సన్గా భారతీయుడికి అవకాశం వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి మూడేళ్లకు కొత్త ఛైర్పర్సన్ను వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. ఇక జపాన్కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని 2017లో ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. అతని పదవీకాలం ముగియనుండటంతో ఆ స్థానంలో భారత్కు చెందిన వ్యక్తిని నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి.
మోడీ సర్కార్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనావైరస్తో వణికిపోతున్న నేపథ్యంలో ఆయా దేశాల పనితీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తోంది. భారత్ విషయానికొస్తే కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ తీసకుంటున్న చర్యలను స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ కొనియాడారు. మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను ఆయన ప్రశంసించారు.
ఈ క్రమంలోనే డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బాడీ ఛైర్పర్సన్ పదవికి భారతీయుడిని నియమించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 22న జరిగే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారని జెనీవా వర్గాల విశ్వసనీయ సమాచారం. అంతేకాదు గతేడాది సమావేశం సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఛైర్పర్సన్గా భారత్కు అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Recommended Video
పూనం ఖేత్రపాల్ సింగ్కు ఆ పదవి దక్కుతుందా..?
ఇక భారత్కు ఆ అవకాశం దక్కితే డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ తీసుకువచ్చే విధానాల్లో ఎగ్జిక్యూటివ్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో డైరెక్టర్ జనరల్ తప్పనిసరిగా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్పర్సన్ను సంప్రదిస్తారు. అంతేకాదు బడ్జెట్, పాలనా వ్యవహారాల్లో కూడా భారత్ పాత్ర పోషిస్తుంది. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఛైర్పర్సన్గా కొత్త డెరెక్టర్ జనరల్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తారు.
వచ్చే ఏడాది అంటే మే 2021లో డాక్టర్ టెడ్రాస్ పదవీకాలం ముగియనుంది. ఇక భారత్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ ఛైర్పర్సన్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా డైరెక్టర్గా డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ వ్యవహరిస్తుండటంతో ఆమె పేరు ఎగ్జిక్యూటివ్ బాడీ ఛైర్పర్సన్ పదవికి వినిపిస్తోంది.