చైనా వివాదం ముదిరితే భారత్ కు ట్రంప్ హ్యాండ్ ? అమెరికా మాజీ భద్రతా సలహాదారు సంచలనం...
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాక అంతర్జాతీయంగా చైనాతో పోలిస్తే భారత్ కు మద్దతు పెరుగుతోంది. వివిధ అంతర్జాతీయ వేదికలపై అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు కూడా భారత్ ను వెనకేసుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అన్న పేరుతో చైనాపై నిప్పులు చెరుగుతున్న ఆయా దేశాలు భారత్ తో తాజాగా నెలకొన్న సరిహద్దు వివాదం విషయంలోనూ ఆ దేశాన్ని టార్గెట్ చేశాయి. కానీ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు అనుగణంగా పనిచేసే పాశ్యాత్య దేశాలను చిరకాలం నమ్మడానికి వీల్లేదన్న విషయాన్ని అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజా వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేశాయి.

భారత్-చైనా ఉద్రిక్తతలు..
చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద గల్వాన్ లోయ వద్ద నెలకొన్న వివాదం ఇంకా పూర్తిగా సమసి పోలేదు. అయితే ఈ వివాదంలో చైనాతో పోలిస్తే భారత్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాతో పాటు దాని మిత్ర పక్షాలైన బ్రిటన్, ఐరోపా దేశాలు భారత్ వాదనకు మద్దతుగా స్పందిస్తున్నాయి. అయితే ఇది శాశ్వతమా అంటే కాదనే వాదన వినిపిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు మార్చుకునే ఈ మిత్ర దేశాల కూటమి భారత్ కు శాశ్వతంగా అండగా నిలిచే అవకాశం లేదని తాజా పరిణామాలను బట్టి అర్దమవుతోంది. తాజాగా అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఉద్రిక్తతలు పెరిగితే భారత్ కు హ్యాండ్...?
చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత పెరిగితే భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హ్యాండిచ్చే అవకాశం ఉందని ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ జోస్యం చెప్పారు. గతంలో ట్రంప్ హయాంలో భద్రతా సలహాదారుగా పనిచేసిన బోల్టన్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు పెరిగితే భారత్ కు ట్రంప్ అండగా ఉంటారన్న గ్యారంటీ లేదని బోల్ట్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రష్యాకు దూరమయ్యాక అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా సాయంతో నెట్టుకొస్తున్న భారత్ కు బోల్టన్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.

ట్రంప్ ప్రయారిటీ అదే...
తాజాగా వియాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన జాన్ బోల్టన్ చైనాతో అమెరికా ఆగ్రహం వాణిజ్య సంబంధాలకు అతీతమేమీ కాదని, భౌగోళిక, వాణిజ్య అంశాల ఆధారంగా చూస్తే భారత్ కంటే చైనాకే అమెరికా సహకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జాన్ బోల్టన్ కుండబద్దలు కొట్టారు. నవంబర్ లో అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ మరోసారి ఎన్నికై ఈ వ్యవహారాన్ని పునస్సమీక్షించే అవకాశాలు ఉన్నట్లు బోల్టన్ చెప్పారు.
ఎన్నికల తర్వాత చైనాతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుని భారత్ కు హ్యాండివ్వడం ఖాయమనే భావన బోల్టన్ మాటల్లో ధ్వనించింది.












Click it and Unblock the Notifications