పీహెచ్డీ,మాస్టర్ డిగ్రీలకు ఈరోజుల్లో విలువ లేదు-అవేమీ లేకపోయినా-తాలిబన్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఆఫ్గనిస్తాన్లో 33 మంది మంత్రులతో ఆపద్దర్మ ప్రభుత్వాన్ని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది ఐరాస భద్రతా మండలి టెర్రరిజం బ్లాక్ లిస్టులో ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాద మతతత్వ నేపథ్యమే వీరిని మంత్రులను చేసింది. అందుకే విద్య,ఇతర ప్రగతి శీల కార్యక్రమాలేవీ వీరికి ఏమాత్రం సహించవు. విద్యాశాఖ మంత్రిగా నియమితులైన కొద్ది గంటల్లోనే షేక్ మొల్వి నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
'ఏ పీహెచ్డీ డిగ్రీ,మాస్టర్ డిగ్రీకి ఇవాళ విలువ లేదు. మీరు చూడండి... ఈరోజు అధికారంలో ఉన్న ముల్లాలు,తాలిబన్లకు పీహెచ్డీలు,ఎంఏలు లేవు. కనీసం హైస్కూల్ డిగ్రీ కూడా లేదు.కానీ ఇప్పుడే వాళ్లే అందరికన్నా గొప్పవారు.' అని షేక్ మొల్వి నూరుల్లా మునీర్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాలిబన్లు మొదటి నుంచి విద్యకు వ్యతిరేకమే. గతంలో 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో విద్యను ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకు విద్యను నిషేధించారు. ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లను మూసివేయించారు. స్త్రీ సమాజంపై అనేకానేక ఆంక్షలతో వారిని అణగదొక్కారు. తాలిబన్ల భయమేంటంటే... శత్రువుల కన్నా చదువుకున్న స్త్రీలతోనే తమకు ఎక్కువ ముప్పు అని భావిస్తారు. అందుకే స్త్రీలకు అన్ని హక్కులు నిరాకరించారు. ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్ని మిలియన్ల మంది స్త్రీలు విద్యాసంస్థల బాటపట్టారు. స్వేచ్చగా,పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందారు. కానీ ఇప్పుడు ఆఫ్గన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి మహిళలు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా షేక్ మొల్వి నూరుల్లా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే... తాలిబన్లకు విద్య అంటే ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతోంది. ఒక విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే... ఆ రంగాన్ని మరింత నాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది.
తాలిబన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు,గ్రూపులకు చోటు కల్పిస్తామని మొదట వారు హామీ ఇచ్చారు. కానీ నిన్నటి జాబితాను గమనిస్తే ఆ మాటను వారు నిలబెట్టుకోలేదు. ఉగ్రవాద నేపథ్యం ఉన్నవారు తప్పితే ఇతర వర్గాలెవరికీ పదవులు దక్కలేదు. కేబినెట్లో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదు. ప్రభుత్వంలో మహిళలకూ ప్రాతినిధ్యం ఉండాలని ఓవైపు వందలాది మంది మహిళలు నిరసనలు తెలియజేస్తున్నా... తాలిబన్లకు అవేవీ పట్టలేదు. నిజానికి ఆఫ్గనిస్తాన్ను ఆక్రమించుకున్న కొద్దిరోజులకే తాలిబన్లు ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక దేశంలో ప్రజాస్వామ్యానికి తావు లేదు... అంతా షరియా చట్టాల ప్రకారమే నడుస్తుందని. అందుకు తగినట్లుగానే వారి చర్యలు కనిపిస్తున్నాయి.
Recommended Video
తాలిబన్ల మొదటి ప్రెస్ మీట్లో వారి మాటలు కొంత ఉదారంగా,వారిలో మార్పు వచ్చిందన్నట్లుగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. షరియా చట్టాలను కఠినంగా అమలుచేసే యోచనలో తాలిబన్లు ఉన్నారు. అదే జరిగితే ఆఫ్గనిస్తాన్లో మానవ హక్కులు... ముఖ్యంగా స్త్రీలకు హక్కులు అనే మాటే వినిపించదు. ప్రజాస్వామ్య గొంతుకలకు తావు ఉండదు. ఈ పరిణామాలన్నీ సగటు ఆఫ్గనిస్తానీని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.