కరోనాపై క్షిపణి దాడులు.. కిమ్ జాంగ్ బిత్తిరి చర్య.. వైరస్ లేదంటూనే 2,590 మందిని చంపేశారా?
ప్రపంచానికి కొరకరానికొయ్యగా పేరుపొందిన ఉత్తరకొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ మరో అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. మిగతా దేశాలన్నీ కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుంటే.. తాము మాత్రమే భద్రంగా, బలంగా ఉన్నామనడానికి సంకేతంగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉండే నార్త్ ప్యోంగ్యాన్ ఫ్రావిన్స్ భూభాగం నుంచి ఉత్తరకొరియా శుక్రవారం రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చిందని, తమ దేశంలో కరోనా లేదని చెప్పుకోడానికే కిమ్ ఈ ప్రయోగాలు జరిపించాడని సౌత్ కొరియా ఆర్మీ చీఫ్ ప్రపంచానికి వెల్లడించారు.
జపాన్ సరిహద్దులో అలజడి..
కిమ్ దేశం పేల్చిన రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు.. సరిగ్గా తమ ప్రాదేశిక జలాల సరిహద్దు దగ్గరే పడ్డాయని జపాన్ అధికారులు తెలిపారు. ప్రపంచమంతా కరోనా భయంతో విలవిల్లాడుతోన్న ప్రస్తుత పరిస్థిలో కిమ్ చర్య ఖండనీయమని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో జరిగిన శాంతి చర్చల్లో.. అణు, క్షిపణి పరీక్షలకు దూరంగా ఉంటానన్న మాటను కిమ్ ధిక్కరించారని జపాన్ మండిపడింది. మరోవైపు..
జాతీయ అసెంబ్లీకి పిలుపు..
ఉత్తరకోరియాలో కరోనా ప్రభావం లేదని ప్రపంచానికి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా.. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయ అసెంబ్లీ నిర్వహించాలని కూడా కిమ్ డిసైడయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సుమారు 700 మందికిపైగా వివిధ శాఖల మంత్రులు, అధికారులు మాస్కులు లేకుండా ఒకే చోట గుమ్మికూడనున్నారు. నిజంగా ఆ సమావేశం జరిగితే గనుక కరోనా విషయంలో కిమ్ జాంగ్ చెబుతున్నది నిజమేనని నమ్మాల్సి ఉంటుందని నార్త్ కొరియా వ్యవహారాల పరిశీలకురాలు రాచెల్ మిన్యాంగ్ లీ అన్నారు.
ఏది నిజం?
చైనా పక్కనే ఉంటూ, డ్రాగన్ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కూడా కలిగిన ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తిపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ మీడియాకు అనుమతి లేకపోవడం, ఇంటర్నెట్ అదుబాటులో ఉండని కారణంగా.. ప్రభుత్వ మీడియా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) ఏది చెబితే అదే వార్త. ఇదే సంస్థ గురువారం చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది.
Recommended Video
కరోనా సోకితే కాల్చివేత..
చైనా, సౌత్ కొరియాల్లో కరోనా విలయతాండవం చేసినప్పటికీ.. పక్కనే ఉన్న ఉత్తరకొరియాలో మాత్రం ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేసీఎన్ఏ వివరణ ప్రకారం మొత్తం 2,590 మందికి కరోనా లక్షణాలు కనిపించాయని, వాళ్లందరినీ క్వారంటైన్ లోకి తీసుకుని చికిత్స అందించగా కోలుకుని ఇళ్లకు కూడా వెళ్లిపోయారని ప్రభుత్వం తెలిపింది. అయితే ట్రీట్మెంట్ పొందిన వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందినవారనేది కూడా వెల్లడి కాకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. దేశంలోకి కరోనా చొరబడితే నిలువునా కాల్చేస్తానంటూ వైద్య అధికారుల్ని కిమ్ హెచ్చరించారన్న వార్తల నేపథ్యంలో ఆ 2590 మందిని చంపేసి ఉంటారా? అని పొరుగుదేశం ఉత్తరకొరియా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది.