అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'
వాషింగ్టన్: అమెరికా పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినా ఉత్తరకొరియా మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఆరవ దఫా అణుపరీక్షల నిర్వహణకు ఉత్తరకొరియా సన్నద్దమౌతోంది.
ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్లు జరిపేందుకు సిద్ధమవుతోందని దక్షిణకొరియా నిఘా సంస్థ యోన్హాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్య సమితి వద్దని వారించినా, ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు విధించినా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తుంది.
మరోసారి ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షకు సిద్ధం అవుతోందన్న వార్తలు వస్తుండటంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే అమెరికా, ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి.కానీ, ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా సెప్టెంబర్9న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు ఉత్తరకొరియా అన్ని విధాలుగా సిద్ధమైపోయిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ యోన్హాప్ ప్రకటించింది.
. సెప్టెంబర్ 9న బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం జరపడానికి ప్రత్యేక కారణం కూడా ఉందని వెల్లడించింది. ఆ రోజు ఉత్తరకొరియా రిపబ్లిక్ డే కావడంతో దాన్నే ముహూర్తంగా ఎంచుకున్నట్లు వివరిస్తోంది.
గత సంవత్సరం కూడా ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు నిర్వహించిందని గుర్తుచేసింది. అయితే అమెరికా, ఐక్యరాజ్య సమితిలు న్యూక్లియర్ పరీక్షలు వద్దని ఎంతగా హెచ్చరించిన ఉత్తరకొరియా పెడచెవిన పెడుతోందని యోన్హాప్ విమర్శించింది. ఇప్పటికే ఉత్తరకొరియా ఎగుమతులపై వేటు పడిందని ఆర్థికంగా ఆ దేశం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పింది.
అయినా న్యూక్లియర్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోందని తెలిపింది. ఒకవైపు కరువు కటాకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రజల కష్టాలు తీర్చాల్సింది పోయి న్యూక్లియర్ టెస్ట్లు అంటూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని అధ్యక్షుడు కిమ్జాంగ్ఉన్ను యోన్హాప్ తీవ్రంగా దుయ్యబట్టింది
ఇప్పటికిప్పుడు ఉత్తరకొరియాకు వచ్చిన ముప్పేమి లేదని కావాలనే ఉద్రిక్తలను రెచ్చగొట్టి ఉత్తరకొరియా ముప్పును కొనితెచ్చుకోవద్దని యోన్హాప్ హెచ్చరిస్తోంది. అమెరికా కూడా ఉత్తరకొరియా మిస్సైల్ టెస్ట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది