నిన్న హైడ్రోజన్ బాంబు, మరో అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధం
అణు పరీక్షతో ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసిన ఉత్తర కొరియా తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేపట్టనుందని తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా సోమవారం ప్రకటించింది.
ప్యోంగ్యాంగ్: అణు పరీక్షతో ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసిన ఉత్తర కొరియా తాజాగా మరో క్షిపణి ప్రయోగం చేపట్టనుందని తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ కొరియా సోమవారం ప్రకటించింది.
ఉత్తర కొరియా మరో అణు పరీక్ష
ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలను గుర్తించామని దక్షిణ కొరియా రక్షణశాఖ తెలిపింది. అది ఖండాంతర క్షిపణి కావొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.ఆదివారం నాటి అణు పరీక్ష తర్వాత మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయని దక్షిణ కొరియా పేర్కొంది.
ఎప్పుడో తెలియరాలేదు
అయితే క్షిపణి వివరాలు, ఎప్పుడు ప్రయోగిస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఆదివారం మరో దురుసు చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. ఆ దేశం అణు పరీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి.
హైడ్రోజన్ బాంబుపై దక్షిణ కొరియా అంచనా
ఈ హైడ్రోజన్ బాంబు విస్ఫోటనంతో చోటుచేసుకున్న భూకంపాన్ని బట్టి ఇప్పటి వరకూ ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే శక్తిమంతమైందని స్పష్టమవుతోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఈ బాంబును పరీక్షించింది. ఈ విస్ఫోటనం వల్ల వెలువడిన శక్తి 50 నుంచి 60 కిలో టన్నులు ఉంటుందని దక్షిణ కొరియా అంచనా వేసింది.
రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత
ఆదివారం ఉదయం ఉత్తర కొరియా అణు పరీక్ష చేపట్టినట్లు జపాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా వెల్లడించింది. అణు పరీక్షతో ఉత్తర కొరియాలో రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు జపాన్ పేర్కొంది. ఇంత తీవ్రతతో భూమి కంపించడంతో ఇప్పటి వరకు చేయని రీతిలో అణు ప్రయోగం చేసినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
పక్కన నిలబడి ఫోటో
ఉత్తర కొరియా అధినేత కిమ్ జుంగ్ ఉన్ హైడ్రోజన్ బాంబు పక్కన నిలబడి దిగిన ఫొటో బయటికి వచ్చిన నేపథ్యంలో ఈ అణు ప్రయోగం జరగడంగమనార్హం. గత మంగళవారం జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా, జపాన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి.