చారిత్రాత్మకం: ద.కొరియా అధ్యక్షుడితో కిమ్ జంగ్ ఉన్ భేటీ, 1953 తర్వాత తొలిసారిగా
పాన్మున్జోమ్: ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఎట్టకేలకు కలుసుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతి పునరుద్దరణ కోసం ఈ ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. ఇద్దరు నేతలు ముఖంపై చిరునవ్వుతో కలుసుకొన్నారు.
ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య చాల కాలంగా యుద్ద వాతావరణం నెలకొంది. 2018 ఆరంభం నుండి ఉత్తరకొరియా అధ్యక్షుడు తీసుకొన్న నిర్ణయాలు రెండు దేశాల మధ్య శాంతిని పెంపొందించే దిశగా సాగుతున్నాయి. దక్షిణకొరియాలో జరిగిన వింటర్ ఒలంపిక్స్కు ఉత్తరకొరియా నుండి ప్రతినిధులను పంపారు. మరోవైపు ఈ క్రీడలకు ఉత్తరకొరియా అధ్యక్షుడి సోదరి కూడ హజరయ్యారు.
మరో వైపు అణు పరీక్షలు నిర్వహించబోమని కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. దక్షిణ కొరియాకు చెందిన అధికారులతో శాంతి చర్చలను ఇంతకుముందే ఉత్తరకొరియా అధికారులు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగానే రెండు దేశాల అధ్యక్షులు సమావేశమయ్యారు.
ఇద్దరు కొరియా దేశాధ్యక్షుల సమావేశం
ఉత్తరకొరియా, దక్షిణారియా అధ్యక్షులు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చల కోసం వీరిద్దరూ సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశం ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఉప్పు నిప్పులా ఉండే ఈ రెండు దేశాలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న శాంతి గ్రామంగా పేరున్న పాన్మున్జోమ్లో కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ను కలుసుకున్నారు.
మొక్కను నాటిన ఇరు దేశాధినేతలు
దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాల అధ్యక్షులు తమ సమావేశానికి గుర్తుగా ఓ మొక్కను కూడ నాటారు.1953-54ల మధ్య యుద్ధం శాంతియుత ఒప్పందంతో ముగియలేదు. అందుకే ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినా ఇరుదేశాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. పాన్మున్జోమ్ సమావేశంలో ఈ సమస్యపై కిమ్, మూన్లు చర్చిస్తారని భావిస్తున్నారు.
1953 తర్వాత తొలిసారిగా దక్షిణకొరియాలో అడుగుపెట్టారు
1953 తర్వాత ఉత్తరకొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో పర్యటించడం బహుశా ఇదే ప్రథమం. ఈ రెండు దేశాల మధ్య కొన్నేళ్ళుగా యుద్ద వాతావరణం సాగుతూనే ఉంది. ఉత్తరకొరియాపై దక్షిణ కొరియా దాడులు నిర్వహించడం, దక్షిణకోరియాపై ఉత్తరకొరియా దాడులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణకొరియాకు అమెరికా, జపాన్లు సహకరిస్తున్నాయి అయితే తమ రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు వీరిద్దరూ ముందుకు రావడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రంప్తో కూడ కిమ్ సమావేశం
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అణుపరీక్షలు నిర్వహించబోనని కిమ్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ఈ తరుణంలో ట్రంప్, కిమ్ మధ్య కూడ చర్చలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే వీరిద్దరి మధ్య ఎప్పుడు ఎక్కడ చర్చలు జరుగుతాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.