అణ్వాయుధాలు సిద్దంగా పెట్టండి: దాడులకు రెడీ
ఉత్తర కొరియా: శత్రుదేశాల నుంచి పెరుగుతున్న ముప్పు కారణంగా తాము ముందు జాగ్రత్తగా అణ్వాయుధాలను సిద్దంగా ఉంచాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఏ సమయంలో నైనా దాడి చెయ్యడానికి మనం సిద్దంగా ఉండాలని సైన్యానికి సూచించారు.
ఉత్తర కొరియా నూతనంగా తయారు చేసిన రాకెట్ లాంచర్ ను పర్యవేక్షించిన సందర్బంగా కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో మాట్లాడారు. అణ్వాయుధాల సంఖ్యను, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరం అని కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్లు ఉత్తర కొరియా అధికార వార్త సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం ఉత్తర కొరియా తీసుకుంటున్న చర్యలపై మరన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో మరో సారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ విషయంపై అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాలని ఉత్తర కొరియాను కోరారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆదేశాలను ఉల్లంఘించిన ఉత్తర కొరియా ఆణ్వాయుధాలు తయారు చేసి ప్రయోగించిన విషయం తెలిసిందే.