ప్రధానికి కూడా ఫైన్.. రూల్స్ బ్రేక్ చేశారని భారీ జరిమానా
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసులు పెరగడంతో అధికారులు కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గీత దాటితే వేటేనని చెబుతున్నారు. అయితే నార్వేలో ఏకంగా ప్రధానమంత్రిని కూడా వదల్లేదు. నిబంధనలను ఉల్లంఘించారని భారీగా జరిమానా విధించారు. దీంతో సమన్యాయ పాలన అంటే ఇదేనని అర్థమవుతోంది. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని నార్వే పోలీసులు స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఏకంగా దేశ ప్రధానికే జరిమానా విధించారు. కరోనా వైరస్ విజృంభిస్తుండంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. బహిరంగ సభలు, పార్టీలపై నిషేధం విధించింది. ఏదైనా కార్యక్రమానికి 10 కంటే ఎక్కువ మంది హాజరు కావొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ అతిక్రమించారు. దీంతో ఆమెను కూడా వదల్లేరు అధికారులు
60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. 13 మంది కుటుంబ సభ్యులతో కలసి ఫిబ్రవరిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో అమె వైఖరిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో స్పందించిన ఎర్నా సోల్బర్గ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కానీ అంతటితో ఆ వ్యవహారం ఆగలేదు. దీంతో పోలీసులు దృష్టిసారించారు. దర్యాప్తు చేసి, దాదాపు రూ.1.75లక్షల ఫైన్ విధించారు. దేశ ప్రధానికి ఫైన్ వేయడం చర్చానీయాంశమైంది. హవ్వా ఇదేంటి అనేవారు కూడా ఉన్నారు. కానీ చాలా మంది మాత్రం ఇదీ కరెక్టేనని అంటున్నారు. రూల్స్కు ఎవరూ అతీతులు కారని చెబుతున్నారు.