భారత్ను రెచ్చగొట్టాలని కాదు, కానీ..: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ (Justin Trudeau) చేసిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇరుదేశాల మధ్య దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ట్రూడో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
భారత్ను తాము రెచ్చగొట్టాలని, లేదా ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదంటూ జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్ను కోరుతున్నామని చెప్పారు. ప్రతి విషయం స్పష్టంగానే ఉందని, అంతా సరైన ప్రక్రియలో సాగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ట్రూడో తెలిపారు.

మరోవైపు, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వ్యవహారంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతేగాక, కెనడా దౌత్యవేత్తను బహిష్కరించి, గట్టిగా బదులిచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రూడో మరోసారి స్పందించడం గమనార్హం.
ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన సమాచారం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది.
కెనడాలోని భారత దౌత్య కార్యాలయంలోని రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్(RAW) అధిపతిని కూడా బహిష్కరించినట్లు సమాచారం. అయితే, ఆ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. భారత్లోని కెనడా దౌత్యవేత్తను పలిపించుకుని తన వాదనను గట్టిగా వినిపించింది. ఐదు రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. కాగా, జీ20 సమావేశాల సందర్భంగా కెనడాలో పెరుగుతున్న ఖలిస్థాన్ ఉగ్రవాదంపై ట్రూడోను ప్రధాని మోడీ హెచ్చరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications