'నగ్నంగా మోకాళ్లపై'... ప్రధానికి షాక్... సిటీ సెంటర్లో కలకలం రేపుతోన్న విగ్రహం...
ఎన్నికలు దగ్గరపడ్డ వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఊహించని రీతిలో నిరసన ఎదురైంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు టెలీ అవివ్ నగరంలోని హబీమా స్క్వేర్ ప్రాంతంలో ఆయన నగ్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మోకాళ్లపై ఓ మూలన కూర్చొన్న బెంజమిన్ నెతన్యాహు... దారిన పోయేవారిని చూస్తున్నట్లుగా ఆ విగ్రహం కనిపిస్తోంది. పూర్తిగా బొగ్గు రంగులో ఉన్న ఆ విగ్రహాన్ని బుధవారం(మార్చి 16) గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఏర్పాటు చేశారు.

తొలగించాలని పోలీసుల నోటీసులు
ప్రధాని నగ్న విగ్రహం ప్రతిష్ఠించారని తెలియగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని... దాని చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేశారు. వెంటనే దాన్ని తొలగించాలని నోటీసులు అంటించారు. విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసిన,దాన్ని తయారుచేసిన శిల్పి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిటీ సెంట్రల్ స్క్వేర్లో ప్రతిష్ఠించిన ఈ విగ్రహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 14 ఏళ్లుగా ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగుతున్న బెంజమిన్ నెతన్యాహు పాలన పట్ల నిరసన తెలిపే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

పాలనలో నెతన్యాహు విఫలమయ్యారన్న విమర్శలు...
ఇజ్రాయెల్లో నెతన్యాహు నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఇదే టెలీ అవీవ్ నగరవాసులు నెతన్యాహును ఎద్దేవా చేసేలా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. విశాలమైన టేబుల్పై నెతన్యాహు ఒక్కడే కూర్చొని విలావంతమైన భోజనాన్ని ఆరగిస్తున్నట్లుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్లో నెతన్యాహు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే వేలాది మంది నిరసనకారులు రోడ్ల పైకి వచ్చి నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దేశం ఆర్థిక సంక్షోభాన్ని,కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో నెతన్యాహు విఫలమయ్యారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం కూలిపోవడంతో... తప్పని ఎన్నికలు...
గతేడాది ఏప్రిల్లో బెన్నీ గాంట్జ్ నేత్రుత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీ,బెంజమిన్ నెతన్యాహు నేత్రుత్వంలోని లికుడ్ పార్టీలు ఇజ్రాయెల్లో సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధాని పదవి కాలాన్ని చెరో సగం రోజులు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఒప్పందం ప్రకారం ముందు 18 నెలలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని పదవిని చేపట్టారు. అయితే ఇంతలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. 2020-2021కి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి చివరకు ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఇజ్రాయెల్లో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారైన ఇజ్రాయెల్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెడుతారా లేక మళ్లీ హంగ్ ఏర్పడుతుందా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications