ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్న బరాక్ ఒబామా
వాషింగ్టన్: మతహింసను సహించబోమని, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీవ్యాఖ్యానించడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగిన క్రైస్తవ సదస్సులో మోడీ.. మతపరమైన హింసను ఖండించారు.
సిక్కులపై సామూహిక హత్యాకాండ, స్వీయగుర్తింపు హక్కు తదితర అంశాలపై మోడీతో చర్చించాలని లక్షా ఇరవై ఐదువేల మంది సంతకాలతో న్యూయార్కుకు చెందిన సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఒబామాను భారత పర్యటనకు ముందు ఆన్లైన్లో కోరింది.
దీనిపై స్పందించిన వైట్హౌస్... జనవరి 27న ఒబామా భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్లో మత స్వేచ్ఛ ప్రాధాన్యం, భారత్లో ఉల్లంఘనలపై ప్రసంగించారని వెబ్సైట్లో పేర్కొంది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా భారత్లాంటి అనేక దేశాల్లో ముస్లింలు ఎన్నో మంచి పనులు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసిస్తూ, అయితే అమెరికాలో చాలామందికి మాత్రం ముస్లిం పట్ల దురభిప్రాయం ఉందని రెండు రోజుల క్రితం చెప్పారు.

మీడియాలో ముస్లింలను ఏ విధంగాను చిత్రీకరిస్తున్నారనే దాని ఆధారంగానే పాశ్చాత్య దేశాల్లో వారి పట్ల అభిప్రాయం ఏర్పడుతోందని, అమెరికాలాంటి ముస్లిం జనాభా తక్కువగా ఉన్న దేశాల్లో చాలా మందికి వ్యక్తిగతంగా నిజమైన ముస్లిం ఎలా ఉంటాడనేది స్పష్టంగా తెలియదన్నారు.
హింసాత్మక ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై అమెరికా విదేశాంగ శాఖలో జరుగుతున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు చివరి రోజయిన గురువారం నాడు మాట్లాడిన ఒబామా.. ఈరోజు మనల్నందరినీ ఇక్కడ ఒక చోటికి చేర్చిన ఓ సవాలులో భాగమైన ఒక బాధాకరమైన వాస్తవం గురించి నేరుగా మాట్లాడదలచుకున్నానని అన్నారు.
ముస్లింల గురించి లేదా ఇస్లామ్ గురించి అమెరికాలోని వారికి లభించే రూపం మీడియాలో వచ్చేదేనని ఒబామా అంటూ ఇప్పుడు వస్తున్న వార్తల సమాహారంలో వారికి లభించేది చాలా వరకు వక్రీకరించబడిన అభిప్రాయమేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న వందకోట్ల మందికి పైగా ప్రజల్లో డాక్టర్లు, లాయర్లు, అధ్యాపకులు, మంచి పొరుగువారు, స్నేహితులు ఎందరో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications