చైనా వింత వాదన: కెనడా నుంచి వచ్చిన పార్శిల్ నుంచే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి
బీజింగ్: కరోనావైరస్ పుట్టినిల్లయిన చైనా ఇప్పుడు ఆ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. జీరో కోవిడ్ విధానాలతో లక్షలాది మందిని లాక్డౌన్లోకి తోస్తోంది. కాగా, ఇటీవల చైనా రాజధాని బీజింగ్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు కూడా వెలుగుచూసింది. అయితే, ఈ కేసుకు కెనడా నుంచి వచ్చిన ఓ పార్సిలే కారణమని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అనుమానం వ్యక్తం చేసింది.
ఇటీవల స్థానికంగా ఓ యువతి.. కెనడా నుంచి అమెరికా, హాంకాంగ్ మీదుగా మూడు రోజుల్లో బీజింగ్కు చేరుకున్న ఓ పార్శిల్ను అందుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. చైనా ఆరోపణలపై కెనడా తీవ్రంగా స్పందించింది. చైనా వాదనను కెనడియన్ ఆరోగ్య అధికారులు తోసిపుచ్చారు. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వైవ్స్ డుక్లోస్ చైనా ఆరోపణలను అసాధారణమైనవిగా అభివర్ణించారు.
కెనడా ప్రధాన వైద్యసలహాదారు డాక్టర్ సుప్రియా శర్మ మాట్లాడుతూ.. ప్యాకేజీలు అంతర్జాతీయ రవాణా మాధ్యమాల ద్వారా వెళ్లాయి కాబట్టి.. వాటిపై వైరస్ మనుగడ సాగించడం అసాధ్యమన్నారు. ఈ విధంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు. చైనా వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని కెనడా ప్రతిపక్ష నేత ఎరిన్ ఓ టూల్ మండిపడ్డారు. కాగా, కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి పార్సిళ్లు, సరుకుల ద్వారా వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు ఉన్నా.. ఈ విధంగా కరోనా వ్యాపించినట్లు ఎక్కడా బలమైన ఆధారాలు లభించకపోవడం గమనార్హం.
అయినప్పటికీ చైనా మాత్రం ఇతర దేశాలపై ఆరోపణలు మానుకోవడం లేదు. ఇటీవల డాగ్రన్ ప్రూట్లపై వైరస్ జాడలు ఉన్నాయంటూ.. పొరుగు దేశమైన వియత్నాం నుంచి ఆ పండ్ల దిగుమతులపై నిషేధం విధించింది. సూపర్ మార్కెట్లనూ మూసివేయించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అనేకమందిని క్వారంటైన్లలోనే ఉంచి చికిత్స అందిస్తోంది. ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వనున్న క్రమంలో కరోనా కట్టడికి చైనా కఠిన చర్యలు తీసుకుంటోంది.