ఒమిక్రాన్.. డెల్టా కంటే తీవ్రమేమీ కాదు, కానీ, ఇప్పుడే చెప్పలేం: ఆంటోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో ఇప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల్లోని ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఇంతకుముందు తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతనే కలిగి ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రమైనదేమీ కాదని అమెరికా అంటు వ్యాధుల నిపుణులు, అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌసీ అన్నారు. ఈ వేరియంట్ పై వెలువడుతున్న ప్రాథమిక నివేదికలను బట్టి ఈ విషయం వెల్లడవుతోందన్నారు. అయితే, మరి కొద్ది నెలల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రావొచ్చని తెలిపారు.
ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి వ్యాప్తి, రెండోది వ్యాక్సిన్లు, ఇమ్యూనిటీని ఈ వేరియంట్ ఎంతవరకు తప్పించుకుంటుంది?, ఇక మూడోది ఏమంటే వ్యాధి తీవ్రత ఎలా ఉండనుంది? అనే వాటిని అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు తెలుస్తోందని అన్నారు.
ఒమిక్రాన్ తో రీఇన్ఫెక్షన్ ముప్పు కూడా గత వేరియంట్ల కంటే ఎక్కువేనని పరిశోధనలు సూచిస్తున్నాయన్నారు. ఇమ్యూనిటీ, వ్యాక్సిన్లను కూడా ఒమిక్రాన్ తప్పించుకోగలదని అన్నారు. వ్యాధి తీవ్రత విషయానికొస్తే.. ఖచ్చితంగా డెల్టా కంటే తీవ్రమైనదేమీ కాదని ఆంటోనీ ఫౌసీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూస్తున్న కేసులు.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రిలో చేరికల మధ్య నిష్పత్తిని బట్టి చూస్తే ఇది డెల్టా వేరియంట్ కంటే తక్కువ తీవ్రమైనదేనని చెప్పొచ్చన్నారు. అయితే, ఈ డేటాతో ఇప్పుడు ఓ నిర్ణయానికి రాలేమని అన్నారు. వ్యాధి తీవ్రతను అంచనా వేయాలంటే మరికొన్ని వారాలు పడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఈ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువ ఉన్నట్లయితే అది ఊరటినచ్చే అంశమేనని ఫౌసీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయిందన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షిణ పొందవచ్చన్నారు.