జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!
జెనీవా: నిజం నిలకడగా తెలుస్తుందంటుంటారు పెద్దలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న వైఖరిలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జమ్మూ కాశ్మీర్ ను భారత్ దే అంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ను 'ఇండియన్ స్టేట్' గా ఆయన అభివర్ణించారు. మంగళవారం జెనీవాలో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశానికి ఖురేషీ హాజరయ్యారు. ఈ కౌన్సిల్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని తప్పు పట్టారాయన. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కులు కనుమరుగు అయ్యాయని విమర్శించారు. రోజుల తరబడి కాశ్మీరీ ప్రజలు తమ ఇళ్లల్లో బందీలుగా ఉంటున్నారని అన్నారు. రాజకీయ నాయకులకు సైతం స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్ ను ఇండియన్ స్టేట్గా అభివర్ణించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, జన జీవనం యథాతధ స్థితికి చేరుకుందని, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొందంటూ భారత్ ప్రపంచ దేశాల్లో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందని ఖురేషీ విమర్శించారు. కాశ్మీరీ ప్రజలు ఇప్పటికీ అడుగు బయట పెట్టలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి గల కీలక సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి దృష్టి సారించాల్సి ఉందని తాము ఇదివరకే కోరిన విషయాన్ని ఖురేషీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకున్నట్టయితే.. కాశ్మీర్ లోయలో పర్యటించడానికి అంతర్జాతీయ మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాల ప్రతినిధులకు అనుమతి ఇవ్వాలని అన్నారు. నిజానికి- పాకిస్తాన్ ఎప్పుడు గానీ జమ్మూ కాశ్మీర్ ను ఇండియన్ స్టేట్ గా గుర్తించలేదు. అధికారిక సమావేశాల్లో గానీ, అధికారిక సమాచార వ్యవస్థలో గానీ జమ్మూ కాశ్మీర్ ను ఇండియన్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ గా మాత్రమే గుర్తిస్తూ వచ్చింది ఇన్నాళ్లు. తాజాగా- పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి స్వయంగా.. జమ్మూ కాశ్మీర్ ను భారత రాష్ట్రంగా గుర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం, అదీ ఓ అంతర్జాతీయ వేదిక మీద ఈ ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది.
#WATCH: Pakistan Foreign Minister Shah Mehmood Qureshi mentions Kashmir as “Indian State of Jammu and Kashmir” in Geneva pic.twitter.com/kCc3VDzVuN
— ANI (@ANI) September 10, 2019












Click it and Unblock the Notifications