ఏ మాత్రం మారని పాక్ .. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన
పుల్వామా ఉగ్రదాడి భారతదేశంలోపెను విషాదాన్ని నింపింది. భారతీయులలో ఆగ్రహావేశాలను మేల్కొలిపింది. ప్రతి ఒక్కరిలో పౌరుషాన్ని తట్టి లేపింది. దేశం మొత్తం ఏకతాటిమీదకు వచ్చి ప్రతీకారం తీర్చుకో వలసిందే అని నినదించింది. ఉగ్రదాడి జరిగిన తరువాత సమయం కోసం వేచి చూసిన భారత్ ఈరోజు తెల్లవారుజామున మెరుపు దాడికి దిగింది. 12 మిరేజ్ యుద్ధ విమానాలతో వెయ్యి కిలోల బాంబులతో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది.భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్తాన్ వణికిపోతుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ అమర జవాన్లు చిందించిన ప్రతి రక్తపు బొట్టు కు సమాధానం గా నిలిచింది.
ఈరోజు జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో మూడు వందలకు పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టి ఇండియన్ ఆర్మీ తన పవర్ ఏంటో చూపించింది. దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ తమ దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని, ప్రాణ హాని కూడా లేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంకోపక్క చైనా వంటి దేశాలతో దయచేసి తమకు సహకరించాలంటూ కోరుతోంది. ప్రస్తుతం ఆత్మరక్షణలో పడిన పాకిస్థాన్ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తామని, ప్రతీకార దాడులు తప్పక చేస్తామంటూ ప్రకటిస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ భారత్ కు సరైన జవాబు చెప్తామని, భారతదేశంపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, తమను తాము రక్షించుకునే హక్కు పాకిస్తాన్ కు ఉందని ఆయన తెలిపారు.
ఊహించని విధంగా భారత్ జరిపిన దాడి తో ఖంగుతిన్న పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ మాట్లాడుతూ వాస్తవాధీన రేఖ దాటి భారత్ పాకిస్తాన్ లోకి చొరబాటు చేసి దాడులకు పాల్పడిందని, కచ్చితంగా ప్రతీకార దాడులు చేస్తామని వెల్లడించారు. ఇది భారత్ పాకిస్తాన్ పై చేసిన తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. దీనికి కచ్చితంగా సమాధానం చెబుతాం అంటూ పాక్ సైన్యం అందుకు సిద్ధంగా ఉందంటూ ప్రకటన చేశారు భారత్ తమపై జరిపిన దాడులపై ఇప్పటికే పలు దేశాలతో చర్చించామన్న ఖురేషి ప్రధానితో చర్చించాక తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు.ఇంత జరిగినా దాయాది దేశం మారకపోవటం యుద్ధ సంకేతమనే భావన కలుగుతుంది.