భారత్ తో ఎక్కువ పెట్టుకోవద్దు: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు, విమర్శలు చెయ్యవద్దని తన మంత్రి వర్గానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారని సమాచారం. ఈ విషయాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్నిహితుడు శుక్రవారం పాక్ మీడియాకు వెల్లడించారు.
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పడానికి అగ్రనేతలు ప్రయత్నిస్తున్న సమయంలో అనవసరంగా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యరాదని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని శుక్రవారం నవాజ్ షరీఫ్ తన మంత్రి వర్గానికి సూచించారు.
భారత్ - పాక్ దేశాల మధ్య శాంతి ఒప్పందాలపై ముందడుగు వేస్తామని నవాజ్ షరీఫ్ ధీమాగా ఉన్నారని ఆయన సన్నిహితుడు అంటున్నారు. ఇరు దేశాల మద్య వైరాన్ని తగ్గించాలని, సంబంధాలు పెంపొందేలా వ్యాఖ్యలు చెయ్యాలని సూచించారు.

ఈ విషయంలో తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రులకు, సన్నిహితులను నవాజ్ షరీఫ్ కోరినట్లు సమాచారం. పారిస్ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ కలుసుకున్న విషయం తెలిసిందే.
తరువాత ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల దైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు బ్యాంకాక్ లో సమావేశమైన విషయం విదితమే. ఈ నెల 8వ తేదిన జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం వెళ్లిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ లో పర్యటించారు.
ఆ సందర్బలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ మంత్రి సర్తాజ్ అజీజ్ తో సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఏదైనా తటస్థ వేదికలో చర్చలు జరగవచ్చని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్నిహితుడు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications