అంత మాటంటారా?: మోడీపై పాక్ అసహనం
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందంటూ పాకిస్థాన్పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించడంతో ఆ దేశం ఉలిక్కిపడింది. వెంటనే మోడీ చేసిన ప్రసంగాన్ని తప్పుబడుతూ పాకిస్థాన్ కొత్తరకం ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.
కాశ్మీర్ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే మోడీ ఇలా తమపై నిందలు మోపే ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. అత్యున్నత స్థాయిలో ఉన్నవారు ఇలా నిరాధార ఆరోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు పదేపదే చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పాక్ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.
కాశ్మీర్లో భారత ఆర్మీ చేస్తున్న అరాచకాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించింది. అంతేగాక, భారతే పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించింది.
కాగా, యూరీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 18 మంది జవాన్ల త్యాగం వృథాగా పోదని, అంతర్జాతీయంగా పాకిస్థాన్ను ఒంటరిని చేయడానికి చేయాల్సిన చర్యలన్నింటినీ చేపడుతున్నామని మోడీ ఇటీవల బహిరంగసభలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే మోడీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ పూర్తి వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది.