ఇష్టం లేని పెళ్ళి చేశారని అత్తింట్లో 13 మందిని చంపిన వధువు
ఇస్లామాబాద్:ఇష్టం లేని వివాహం చేసుకొన్నారని అత్తింటిలో 13 మందికి విషమిచ్చి చంపేసింది నవ వధువు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకొంది. భర్తను చంపేందుకు ప్లాన్ చేసి చివరకు అత్తింట్లోని 13 మందిని ప్రాణాలను తీసింది హసియా అనే యువతి.
బలవంతపు వివాహం చేసుకున్న ఓ నవవధువు పథకం ప్రకారం విషమిచ్చి 13 మందిని హతమార్చింది. ఈ ఘటన పాకిస్తాన్లోని లాహోర్ ప్రావిన్సులోని ముజఫర్గఢ్లో జరిగింది.
ఇటీవల బలవంతపు పెళ్లి చేసుకున్న హాసియా అనే మహిళ తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త అమ్జద్ను చంపేసేందుకు పాలలో విషం కలిపింది.అయితే అదృష్టవశాత్తు అమ్జద్ ఆ పాలు తాగలేదు. దీంతో అవే పాలతో లస్సీ తయారుచేసి అత్తింటివారందరికీ అందించింది. విషతుల్యమైన ఆ లస్సీ తాగి 13 మంది చనిపోయారు.
మరో 14 మంది విషప్రభావంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పథకం ప్రకారమే తానీ పని చేశానని పోలీసు విచారణలో హాసియా ఒప్పుకుంది. హత్యలో హాసియాకు సాయపడినట్లుగా భావిస్తున్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.