భుట్టో హత్య: పర్వేజ్కు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఆ దేశ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదనలు విన్న రావల్పిండి కోర్టు ముషారఫ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
భుట్టో హత్య కేసులో ముషారఫ్ నిందితుడేనని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో పేర్కొంది. బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ విచారణలో తమకు సహకరించడం లేదని, అతడు పరారీలో ఉన్నాడని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది.
ప్రస్తుతం ముషారఫ్ బ్రిటన్లో నివాసం ఉంటున్నాడని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. భుట్టోకు సరైన రక్షణ కల్పించకుండా, ఆమెపై తాలిబన్లు ఆత్మహుతి దాడి చేసేందుకు ముషారఫ్ సహకరించారని ఛార్జీషీటులో పేర్కొన్నారు. భుట్టో రెండు సార్లు తనకు రక్షణ కల్పించాలని ముషారఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అతడు సరైన రీతిలో స్పందించలేదని ఎఫ్ఐఏ బృందం తెలిపింది.
సెక్యూరిటీ కల్పించని కారణంగానే భుట్టో హత్యకు గురయ్యారని బృందం పేర్కొంది. ముషారఫ్ ఆదేశాల మేరకు భుట్టోకు రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు మాజీ పోలీసు ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఐఏ తెలిపింది. కాగా, ముషారఫ్పై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అతని తరపు న్యాయ సహాయకుడు ఒకరు తెలిపారు.
2007 డిసెంబర్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం రావల్పిండికి వచ్చిన బెనజీర్ భుట్టో తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, 2009 ఏప్రిల్ నుంచి ముషారఫ్ పాకిస్థాన్ దేశంలో ఉండటం లేదు. తాలిబన్ ఉగ్రవాద సంస్థ అధిపతి బెతుల్లా మెహసూద్ను అమెరికా దళాలు 2009లో మట్టుపెట్టాయి.